ఔటర్ రింగ్ రోడ్డు కుంభకోణం
ఔటర్ రింగ్ రోడ్డు కుంభకోణంలో పెద్దల ప్రమేయం ఉన్నట్టు ఒక ప్రముఖ దినపత్రిక ఫోటోలు, సర్వే నెంబర్లతో సహా వెల్లడించినా ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి తన సహజసిద్ధమైన నవ్వుతో వాటిని తేలిగ్గా కొట్టిపారేయడం చర్చనీయాంశమైంది. ఆ ఇన్వెస్టిగేటివ్ రిపోర్టు తెలుగుదేశం ఆఫీసులో తయారైందా? టిడిపి కోసం ఆ పత్రిక ఆఫీసులో తయారైందా అన్నది ఇక్కడ అప్రస్తుతం. రూ.2,500 కోట్ల భూ కుంభకోణానికి పాల్పడిన రాజశేఖరరెడ్డి ప్రభుత్వానికి ఇంకా అధికారంలో కొనసాగే హక్కు ఉందా అన్నది ప్రశ్న.
అయితే ఏ ఆరోపణ అయినా నిజమని నిరూపణ జరిగినప్పుడే రాజీనామా విషయం చర్చకు రావాలి. ఈ అంశంపై తెలుగుదేశం పార్టీ హైకోర్టులో కేసు వేసినందువల్ల న్యాయస్ధానం తీర్పు వెలువడేవరకు దీని మీద వ్యాఖ్యానాలు చేయకపోవడమే మంచిది. ఎస్.రామచంద్రరావు వంటి కాకలుదీరిన న్యాయవాదిని పెట్టుకున్న టిడిపి నిజాలను నిగ్గుదేల్చగలమన్న ధీమాతో ఉంది. గతంలో చంద్రబాబు అవినీతి మీద అప్పటి ప్రతిపక్ష నాయకుడు రాజశేఖరరెడ్డి తరఫున కేసు వేసిన చరిత్ర రామచంద్రరావుది. అప్పుడు చంద్రబాబు మీద కేసును ఉపసంహరించుకున్న రాజశేఖరరెడ్డి మీద మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. అయితే కోర్టు కేసును నడిపించడానికి తనకు ఆర్ధిక స్ధోమతు లేనందున చంద్రబాబు మీద కేసును ఉపసంహరించుకున్నట్టు అప్పట్లో రాజశేఖరరెడ్డి చెప్పుకున్నారు. నిజానిజాలు ఆ దేవుడికి, ఈ రామచంద్రరావుకే తెలిసిఉండాలి.