యాసిడ్ దాడి తెలుగు హీరోల పుణ్యమే?
మరో ప్రక్క సందట్లే సడేమియా అన్నట్లు రవితేజ ఇడియట్ సినిమా చర్చకు వచ్చింది. అందులో హీరో తనకు నచ్చిన అమ్మాయి వెనక అల్లరి చేస్తూ పడటాన్ని ప్రేమించమని వేధించటాన్ని కొందరు మహిళలలు ఛానెల్స్ లో చర్చిస్తున్నారు. మరో ప్రక్క ఇది సినిమావారి తప్పేనంటూ కొందరు మహిళలు ఘాటుగానే విమర్శలు చేసారు. ఆ సంఘటనకు బలైన స్నప్నిక,ప్రణీతలను పలకరించటానికి ప్రజారాజ్యం పార్టీ తరుపున వెళ్ళిన చిరంజీవి,పవన్ కళ్యాణ్ లను అక్కడున్న ఆడవాళ్ళు మీరు తయారు చేసే సినిమాల వల్లే ఇవన్నీ జరుగుతున్నాయంటూ విమర్శించారు.అలాగే ప్రగతి శీల మహిళా సంఘం నాయకురాలు సంధ్య, ఆమె అనుచరులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసారు. అటువంటి సినిమాలు యువత మనస్సుని చెడకొడుతున్నాయన్నారు. అమ్మాయిలును టీజింగ్ చేయటమే హీరోయిజం అని చూపెట్టటం వలనే ఇవన్ని సంభవిస్తున్నాయన్నారు.
సంద్య ఈ విషయమై మాట్లాడుతూ హీరో కి తను ప్రేమించే అమ్మాయి ఇష్టంతో పనిలేదు ఏదో విధంగా ప్రేమించమని వెంటపడుతూంటాడు. ఇటువంటి మెసేజ్ సినిమాల ద్వారా ఇచ్చి మళ్ళి పలకరించటం ఎందుకు అన్న ధోరణి వారిలో కనపడింది.అయితే చిరంజీవి దీనికి డైరక్ట్ గా సమాధానం ఇవ్వలేదు. ఇటు వంటి సంఘటనలు చూసి ప్రజలు చాలా భయపడుతున్నారు.గవర్నమెంట్ ఇలాంటి వాటికి భాధ్యత వహించాలని అన్నారు.మరొకామె ఇలాంటివి రవితేజ రెగ్యులర్ సినిమాల్లో ఎక్కువ ఉంటాయని చెప్పుకొచ్చారు.మొత్తానికి సినిమా వారు ఇండైరక్ట్ గా ఇలాంటివి జరగటానికి దోహదం చేస్తున్నారంటూ నిర్ణయానికొచ్చారు.
ఇక సినిమాలు జనాన్ని పాడుచేస్తున్నాయా కాదా అనే విషయం కన్నా ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయి. పాపం మృత్యువుకు దగ్గరవుతూ జీవితాన్ని కోల్పోతున్న ఆ అమ్మాయిలు పరిస్ధితి తర్వాత ఏమిటి అని ఆలోచించేవారు లేదు. మరో ప్రక్క ఆల్రెడీ మరణాన్ని కౌగిలించుకున్న నిందుతులు తల్లి తండ్రుల మానసిక క్షోభని అంచనా వేసి ఓదార్చే దిక్కు లేదు. అన్నిటి కన్నా ఈ టాపిక్ ఇటు టీవీల వారికి టీఆర్ పీలకు,ఎలా గయినా గుర్తింపు తెచ్చుకుందామనుకునే వ్యక్తులకు, చూద్దాం కొంతైనా రాజకీయ లభ్ది అయినా చేకూరదా అని కామెంట్ చేసేవారకు లాభిస్తోంది. రాబందుల రెక్కల చప్పుడు అంటే ఇదేనేమో...