గుంటూరు రైతు కోసం బహిరంగ సభ విజయం సాధించడంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెగ సంబరపడిపోతున్నారట. తమ క్యాడర్ ను, నాయకులను వైయస్ జగన్ తన చరిష్మాతో తన్నుకుపోతారనే భయం దీంతో పటాపంచలైనట్లు చెబుతున్నారు. గుంటూరు సభకు భారీగా ప్రజలు వచ్చారు. చంద్రబాబు ప్రసంగానికి కొంత మేరకు కేరింతలు కూడా వినపించాయి. చప్పట్లు మోగాయి. దీంతో తన ఇమేజ్ అలాగే ఉందని చంద్రబాబు సంతోషపడుతున్నారని అంటున్నారు. జాతీయ నాయకులు కూడా సభకు వచ్చిన ప్రజలను చూసి చంద్రబాబును తెగ పొగిడేశారు. చంద్రబాబు వెంట నడుస్తామని ప్రజల సాక్షిగా పలికారు. దీంతో చంద్రబాబు జాతీయ నాయకుల్లో అతి ముఖ్యమైన నేతగా అవతరించారని అంటున్నారు. రైతుల కోసం తాను చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షదే వైయస్ జగన్ చేపట్టిన 48 గంటల లక్ష్యదీక్ష మీద పైచేయి అయిందని చంద్రబాబు గట్టిగా నమ్ముతున్నారట. సరే, ఎవరి సంతోషం వారిది, ఎవరి నమ్మకం వారిది. ఎన్నికలు వస్తే గానీ అసలు సంగతి బయటపడదు కదా, అంతవరకు ఎవరైనా ఎన్ని నమ్మకాలైనా పెట్టుకోవచ్చు.