అధిష్టానాన్ని ధిక్కరించి ఓదార్పు యాత్ర చేపడుతున్న కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ను శాసనసభ్యురాలు కొండా సురేఖ ముంచుతారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేస్తూ మంత్రిపదవికి రాజీనామా చేసిన ఆమె మాట మార్చారు. తనకు మంత్రి పదవిపై ఏ మాత్రం ఇష్టం లేదని, వైయస్ జగన్ కోసం తాను రాజీనామా చేస్తున్నానని అప్పట్లో ఆమె గంభీర వచనాలు పలికారు. ముఖ్యమంత్రి రోశయ్య ఆహ్వానిస్తే తాను మంత్రివర్గంలో చేరడానికి సిద్ధంగా ఉన్నానని తాజాగా ఆమె అన్నారు. జగన్ ను ముఖ్యమంత్రి చేయాలనే డిమాండ్ నుంచి తాము వెనక్కి తగ్గుతున్నట్లు కూడా తెలిపారు. జగన్ కు పార్టీలో మంచి స్థానం కావాలని మాత్రమే తాము ఇప్పుడు కోరుతున్నామని ఆమె గురువారంనాడు అన్నారు. జగన్ ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనేది అంత ముఖ్యం కాదని ఆమె అన్నారు. కొండా సురేఖ మాట మార్చడం వెనక గల కారణమేమిటనేది తెలియడం లేదు. వైయస్ జగన్ అధిష్టానంపై చేస్తున్న పోరులో విఫలమైనట్లు ఆమె భావిస్తున్నారా, తెలియదు. ఓదార్పు యాత్రలో పాల్గొంటున్న నాయకులపై పార్టీ నాయకత్వం ఓ వైపు కొరడా ఝళిపిస్తుండగా, జగన్ ప్రసంగాలు నానాటికీ రోటీన్ గా మారిపోతున్నాయనే అభిప్రాయం కూడా ఉంది. ఈ స్థితిలో ఆమె తిరిగి రోశయ్య పంచన చేరడానికి సిద్ధపడుతున్నారా అనేది తెలియడం లేదు. అయినా, ఆమె అడిగినంత మాత్రాన రోశయ్య మంత్రి పదవి ఇస్తారా, ఆమె అతి విశ్వాసం కాకపోతే. ఒకవేళ, రోశయ్య ఇష్టపడినా సీనియర్ శాసనసభ్యులు పడనిస్తారా అనేది కూడా అనుమానమే.