'జగన్ 2వేళ్లు చూపిస్తే అర్థంకాలేదు: జఫా అంటే..'
దేశపతి శ్రీనివాస్ పాటలు, కథల రూపంలో, వ్యంగం, హాస్యంతో నేతలను విమర్శిస్తూ సభకు హాజరైన వారిని ఉత్సాహపరిచారు. తన కొడుకు జైల్లో పడ్డాడని, తన దుఃఖం చూడండంటూ విజయమ్మ ఇక్కడకు వస్తున్నారని విమర్శిస్తూ... అమ్మా విజయమ్మ! కొడుకును కొంగున కట్టుకుని వీపునకు చుట్టుకుని యుద్ధం చేసిన ఆరుట్ల కమలమ్మల సంస్కృతి తెలంగాణది గానీ, జైల్లో పడ్డ కొడుకు కోసం ఓట్లు అడుక్కునే విజయమ్మల సంస్కృతి తమది కాదన్నారు.
విజయమ్మను చూస్తే తనకు ఒకటి గుర్తుకు వస్తోందని, కరుణామయుడు సినిమాలో క్రీస్తును శిలువ వేస్తే ఆ శిలువను మోసుకుని పోతూ ఉంటాడని, ఆయన వెంట నడిచే ప్రజలందరూ అయ్యో దైవస్వరూపుడైన ఆయనకెంత కష్టమంటూ ఏడుస్తుంటారని, అప్పుడు ఏసు తన కోసం ఏడ్వకండని, మీ కోసం, మీ పిల్లల కోసం ఏడ్వండని అంటాడని, కానీ, విజయమ్మ.. తన కోసం, లక్షకోట్లు దిగమింగి జైల్లో కూర్చుని అధికారం కోసం పావులు కదుపుతున్న జగన్ కోసం ఏడ్వండని చెబుతోందని ఎద్దేవా చేశారు.
జగన్ జైల్లోకి పోతూ.. దేశం కోసం ఏదో చేసినట్లు రెండు వేళ్లూ చూపించాడని, అదేంటో తనకు అర్థం కాలేదని, ఇదే విషయాన్ని ఓ రాయలసీమ పెద్ద మనిషిని అడిగానని, ఆయన దాని అర్థం తనకు చెప్పారన్నారు. జగన్ చూపించిన సంకేతం.. తాను తిన్నది లక్ష కోట్లు కాదని, రెండు లక్షల కోట్లు అని అర్థం వచ్చేందుకు అలా సూచించాడన్నారు.
మొన్న సూర్యాపేటకు వచ్చానని, ఇక్కడొకాయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరాడంటే ఆయనను తూర్పారబడదామని వచ్చానని, అప్పుడో పిల్లాడు ఆయన గురించి ఏం మాట్లాడతావు, ఆయనొక జఫా అన్నాడన్నారు. జఫా అంటే జగన్ ఫాలోయర్స్ అని ఆ పిల్లోడే చెప్పాడన్నారు. ఇప్పటి నుంచి జగన్ పార్టీలో చేరినవారందరినీ మనం జఫా అని పిలవాలని, తెలంగాణ ప్రజలకు కూడా ఇదే చెప్పాలన్నారు.
తాను జగనన్న వదిలిన బాణాన్ని అని షర్మిల చెబుతోందన్నారు. కానీ ఆమె బాణం కాదని సీమాంధ్ర నాయకులు చేతబడి చేసిన వదిలి బాణామతి అని, ఆమె తెలంగాణ పాలిట చేతబడి అన్నారు. రెండు లక్షల కోట్ల రూపాయలు వెనుకేసుకుని.. మనకు రూ.200 పింఛను ఇస్తే.. సంబరపడుతున్నామని, మొన్న ఒకాయన ఒక కథ చెప్పాడన్నారు.
హైదరాబాద్ నుండి ఒకతను జేబులో రూ.1000 పెట్టుకొని బయలుదేరాడని, ఓ ఆంధ్రా అతను మాటల్లో దింపి డబ్బులు కొట్టేసి తిరిగి వచ్చి ఊరు వెళ్లేందుకు రూ.200 సహాయం చేశాడని, అప్పుడు అతను ఆంధ్రా అతను దేవుడు అంటూ కొనియాడాడని చెప్పారు.