వైయస్ జగన్తో దోస్తీకి రాహుల్ గాంధీ?
తన ప్రయత్నాల్లో భాగంగానే ఆయన తన ఇద్దరు పరిశీలకులను రాష్ట్రానికి పంపినట్లు తెలుస్తోంది. వారు ఎక్కువగా వైయస్ జగన్పై ఆరా తీయడం మీదనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. వైయస్ జగన్తో రాజీకి వస్తే ఎలా ఉంటుందనే విషయంపైనే వారు శనివారం రాయలసీమకు, ఆంధ్రకు చెందిన పార్లమెంటు సభ్యులను, శాసనసభ్యులను అడిగారు.
కాంగ్రెసు ప్రయత్నాలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాస రెడ్డి కూడా ధ్రువీకరించారు. తమతో పొత్తుకు కాంగ్రెసు పార్టీ ప్రయత్నాలు సాగిస్తోందని ఆయన అన్నారు. అయితే, తాము మునిగిపోయే పార్టీతో వెళ్లాల్సిన అవసరం లేదని భావిస్తున్నామని ఆయన అన్నారు. దీన్నిబట్టి కాంగ్రెసులో వైయస్ జగన్ విషయంలో అంతర్మథనం ప్రారంభమైందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
తాము కేంద్రంలో యుపిఎ వెంట ఉంటామని వైయస్ జగన్ గతంలో చాలా సార్లు చెప్పారు. ఇది కూడా కాంగ్రెసు అధిష్టానానికి కొంత ఊరట కలిగించే విషయమే. దానివల్లనే రాహుల్ గాంధీ వైయస్ జగన్తో దోస్తీకి ప్రయత్నాలు మొదలు పెట్టారని అంటున్నారు. రాష్ట్రానికి చెందిన కాంగ్రెసు నాయకుల్లో చాలా మంది ఇప్పటికీ వైయస్ జగన్కు అనుకూలంగా ఉండడమే అందుకు కారణం కావచ్చు. లేదా, కెవిపి రామచందర్ రావు ప్రయత్నాలు కూడా అందుకు అనుకూలంగా ఉండవచ్చు. అయితే, సోనియా గాంధీ మాత్రం జగన్తో జత కట్టాలనే ఉద్దేశాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెబుతున్నారు.