రాష్ట్రపతి పోల్స్కు వేంకటేశ్వర స్వామి ఆశీర్వాదం

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కనుమూరి తొలి ఓటేస్తే సాక్ష్యాత్తూ ఆ వేంకటేశ్వర స్వామి వారే ఆశీర్వదించినట్లవుతుందని చిదంబరం సూచించారట. దీంతో తెలుగువాడి ఓటుతో 14వ రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. శ్రీవారి ఆశీర్వచనంతో మొదలైన ఓటింగ్ను స్వర్ణ దేవాలయంతో కొనసాగించాలని మన రాష్ట్రానికి చెందిన సీనియర్ రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు సూచించడంతో పంజాబ్లోని హోసియార్పూర్ ఎంపీ సంతోష్ చౌదరితో రెండో ఓటు వేయించారు.
ఉదయం పది గంటలకు పార్లమెంటు భవనం తొలి అంతస్తులోని 63వ నెంబర్ హాలులో ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. నోయిడా శాసనసభ్యుడు మహేష్ కుమార్ శర్మ ఓటుతో ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. ఆ వెంటనే ఎన్నికల ఏజెంట్ల సమక్షంలో రిటర్నింగ్ అధికారి వికె అగ్నిహోత్రి బ్యాలెట్ బాక్సును ఒక చెక్కపెట్టెలో ఉంచి సీల్ చేసి స్ట్ర్రాంగ్ రూంకి తరలించారు. పూర్తి ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగింది. పార్లమెంటు ఆవరణలో 674 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రణబ్ ముఖర్జీ, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీలు కలిసి కట్టుగా వచ్చి మధ్యాహ్నం పదకొండు గంటల సమయంలో ఓటు వేశారు. ఎల్ కె అద్వానీ, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్, మాయావతిలు సొంత పార్టీ ఎంపీలతో ఉమ్మడిగా ఓటు వేసి వెళ్లారు.
కాగా రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తూ ఓటేసుకున్న రెండో వ్యక్తిగా ప్రణబ్ ముఖర్జీ రికార్డులకెక్కారు. 1982లో జరిగిన ఎన్నికలలో ఎంపీగా ఉంటూ రాష్ట్రపతి పదవికి పోటీ చేసి ఓటేసుకున్న తొలి వ్యక్తిగా జ్ఞానీ జైల్ సింగ్ పేర ఇప్పటి వరకూ ఈ రికార్డు ఉంది. పార్లమెంటులో ఓటేయాల్సిన వారిలో పదిమంది ఎంపీలు ఆ హక్కు వినియోగించుకోలేదు. వారంతా యుపియేతర పక్షాల వారే.
మొత్తంగా చూస్తే 21 మంది ఎంపీలు గైర్హాజరయ్యారు. ఇందులో టిడిపి, టిఆర్ఎస్, సిపిఐ, ఆర్ఎస్పీ ఎంపీలున్నారు. తృణమూల్ కాంగ్రెసు, ఏఐఏడిఎంకే ఎంపీలంతా వారి సొంత రాష్ట్రాల్లోనే ఓటు హక్కు వినియోగించుకున్నారు. పార్లమెంటులో 96.60 శాతం ఓట్లు పోలయ్యాయి. పార్లమెంటులో ఓటేయడానికి ఎన్నికల సంఘం అనుమతించిన 706 మందిలో 682 మంది(8మంది ఎమ్మెల్యేలు సహా) ఓటు హక్కు వినియోగించుకున్నారు.












Click it and Unblock the Notifications