బండ్ల గణేష్-బొత్స లింక్స్పై కన్ను:కోటిచ్చి వచ్చాడు!
ఉదయం పదిన్నర గంటల నుండి దాదాపు ఒకటింటి వరకు గణేష్ను అధికారులు విచారించారు. సినిమా విజయోత్సవ ఫంక్షన్లో కలెక్షన్లపై గణేష్ స్వయంగా వెల్లడించిన వైనాన్ని టివిల క్లిప్పింగులను చూపించి మరీ అధికారులు ప్రశ్నించారట. తొలి సినిమా ఆంజనేయులు రూ.20 కోట్లతో నిర్మించినా ఏమీ వెనక్కి రాలేదని, రెండో సినిమా తీన్మార్ రూ.30 కోట్లతో నిర్మిస్తే అదీ అంతంత మాత్రమే నడిచింది.
అయినప్పటికీ మూడో సినిమా గబ్బర్సింగ్ నలభై కోట్లు ఖర్చుపెట్టి ఎలా తీయగలిగారని అధికారులు ఆరా తీశారట. అంతేకాకుండా తదుపరి బాద్షా చిత్రం యాభై కోట్ల రూపాయలతో తీస్తుండటంతో దాని పైన, ఓ దర్శకుడికి ఇచ్చిన లక్షల విలువైన యాష్ ట్రే గురించి.. ఇలా అన్నింటి పైనా ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. అధికారుల ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి అయిన బండ్ల గణేష్ దిక్కుతోచని స్థితిలో కోటి రూపాయల అడ్వాన్స్ టాక్స్ చెల్లించి బయటకు వచ్చారట.
అదే సమయంలో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో సంబంధాలపై కూడా స్కానింగ్లో ఉంచారట. బొత్సతో బండ్ల గణేష్కు మంచి సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. స్వయంగా గణేష్ ఈ విషయాన్ని ఓసారి చెప్పడం బొత్సపై విమర్శలు గుప్పించేందుకు టిడిపికి అప్పుడు అస్త్రం దొరికింది. బండ్ల గణేష్ ఇంటిపై దాడులు నిర్వహించినప్పటికీ బొత్సతో సంబంధాలపై అధికారులు ఓ కన్ను వేశారట.