తెలంగాణ: పలికింది గంటా, పలికించింది చిరంజీవి?
తాను కేంద్ర మంత్రిగా ఉండడంతో రాష్ట్ర విభజనపై మాట్లాడడం మంచిది కాదని, తన గౌరవానికి భంగం వాటిల్లుతుదని చిరంజీవి భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అనాల్సిన మాటలను చిరంజీవి గంటా శ్రీనివాస రావుతో అనిపించారని అంటున్నారు. గంటా శ్రీనివాసరావు చిరంజీవి అత్యంత సన్నిహితుడనే విషయం అందరికీ తెలిసిందే. కాంగ్రెసులో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయక ముందు సమైక్యాంధ్ర కోసం చిరంజీవి సీమాంధ్రలో పర్యటనలు కూడా చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చిరంజీవి పూర్తి వ్యతిరేకమనే విషయం కూడా అందరికీ తెలిసిందే. ఓ వైపు తాను అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెబుతూ చిరంజీవి తెరవెనక తెలంగాణకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్లు వినికిడి. చిరంజీవికి, విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్కు మధ్య సాన్నిహిత్యం ఉంది.
లగడపాటి రాజగోపాల్తో కలిసి చిరంజీవి వర్గానికి చెందిన నాయకులు సమైక్యాంధ్ర కోసం ప్రణాళిక తయారు చేస్తున్నట్లు చెబుతున్నారు. గంటా శ్రీనివాస రావుతో పాటు చిరంజీవికి సన్నిహితులైన మరింత మంది సమైక్యవాదులు తెలంగాణను అడ్డుకోవడానికి ముందుకు వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.