అక్బర్ అరెస్టు: ఓవైసీ ఫ్యామిలీకి తొలి షాక్
పాతబస్తీని తమ సామంత రాజ్యంగా చేసుకున్నట్లు ఓవైసీ కుటుంబ సభ్యులు వ్యవహరిస్తూ వస్తున్నారు. పాలక పార్టీల అండదండలతో వారు పాడిందే పాట, ఆడిందే ఆటగా కొనసాగుతూ వచ్చింది. దేశద్రోహం, దేశ సారభౌమత్వాన్ని సవాల్ చేయడం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద అక్బరుద్దీన్పై కేసులు పెట్టారు. ఇంత తీవ్రమైన సెక్షన్ల కింద ఓవైసీ కుటుంబ సభ్యులెవరూ ఇంతకు ముందు అరెస్టు కాలేదు.
అక్బరుద్దీన్ను అరెస్టు చేసే సాహసం చేస్తారా అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్న తరుణంలో ప్రభుత్వం తెగువతో వ్యవహరించింది. లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత అక్బరుద్దీన్ ఓవైసీ అరెస్టు నుంచి తప్పించుకోవడానికి పెద్ద ప్రయత్నమే చేశారు. కానీ, ఆ ప్రయత్నాలను పోలీసులు వమ్ము చేశారు. ముస్లిం మైనారిటీలకు తాము తప్ప దిక్కు లేదనే తరహాలో ఓవైసీ సోదరులు వ్యవహరిస్తూ వచ్చారు. అందువల్ల తమకు వారి మద్దతు ఉంటుందని, దాంతో తాము ఎంత దూరమైన వెళ్లవచ్చునని భావించారు. కానీ వారి ఆశలు అడియాశలు అయ్యాయి.
1970 దశకంలో, అంతకు ముందు పాతబస్తీలో మత ఘర్షణలు తరచుగా జరుగుతున్నప్పుడు సాలారా సల్లావుద్దీన్ ఒవైసీని పోలీసులు అరెస్టు చేసి, కేసు నమోదు చేసి బెయిల్పై విడుదల చేసేవారు. ఆయన కుమారుడు, ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ పైనా ముస్లింలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారన్న ఆరోపణపై తెలుగుదేశం పార్టీ హయాంలో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అలాంటి చిన్నా చితకా కేసులు తప్ప ప్రస్తుతం అక్బర్పై నమోదు చేసినంత తీవ్రమైన కేసులు ఎన్నడూ సాలార్ కుటుంబంపై నమోదు కాలేదు.
సుప్రసిద్ధ ఉర్దూ దినపత్రిక సంపాదకుడొకరిపై అర్ధరాత్రివేళ దాడి జరపటం, ఆయనపై అశుద్ధం చల్లించటం, బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ తన రచన లజ్జ తెలుగు అనువాద ప్రతి ఆవిష్కరణకు వచ్చినప్పుడు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించటం, నీలోఫర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లపై దాడి చేయటం, గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అసదుద్దీన్ ఒవైసీ స్వయంగా దుడ్డుకర్ర చేతబట్టి వోటర్లను తరిమి కొట్టటం, అప్పట్లో డిజిపి స్థాయిలో ఉన్న అధికారిని యూనిఫామ్ తీసి వస్తే పాతబస్తీలో తడాఖా చూపిస్తామని బెదిరించటం వంటి దుందుడుకు చర్యలకు ఓవైసీ సోదరులు పాల్పడిన సందర్భాలున్నాయి. ఇటువంటి చర్యలతో సెక్యులర్ ముస్లిం మేధావుల మద్దతును మజ్లీస్ పూర్తిగా కోల్పోయింది.