వైయస్ జగన్ విడుదల చంద్రబాబుపై పిడుగు
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ లభించి, ఆయన జైలు నుంచి విడుదల కావడం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఊహించని దెబ్బగా అంచనా వేస్తున్నారు. నిజానికి, చంద్రబాబుకు ఇది అనూహ్యమైన పిడుగుపాటే. సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీపై జగన్ విడుదల దెబ్బ పడుతుందని అంటున్నారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న చంద్రబాబు కాంగ్రెసు అధిష్టానం విభజన నిర్ణయం తీసుకున్న తర్వాత సీమాంధ్రలో పర్యటించారు.
సీమాంధ్ర పర్యటనలో సమైక్యాంధ్రకు అనుకూలంగా చంద్రబాబు మాట్లాడారు. తద్వారా సీమాంధ్ర ప్రజలను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. అయితే, అంతగా ఫలితం ఇవ్వలేదనే విషయాన్ని పార్టీ నేతలే గ్రహించారు. తెలంగాణను వదిలేసి సమైక్యాంధ్ర నినాదాన్ని భుజానికి ఎత్తుకున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ముందు తెలుగుదేశం పార్టీ సీమాంధ్రలో నిలబడే పరిస్థితి లేదని అంటున్నారు.
వైయస్ జగన్ విడుదలతో సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీకి మరిన్ని కష్టాలు తప్పవని అంటున్నారు. జగన్ తన వ్యూహాలకు మరింత పదును పెట్టి సీమాంధ్రలో ఇతర పార్టీలకు స్థానం లేకుండా చేసేందుకు పనిచేస్తారనే వాదన వినిపిస్తోంది. ఈ విషయంపై జాతీయ మీడియాలో కూడా ఇటువంటి విశ్లేషణలే సాగుతున్నాయి.
రాష్ట్ర విభజన నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అత్యంత వేగంగా స్పందించి పైచేయి సాధించిందనే అభిప్రాయం చంద్రబాబుకు కూడా ఉన్నట్లు ఆయన మాటల ద్వారా తెలిసిపోతూనే ఉంది. తెలంగాణకు అనుకూలంగా సిడబ్ల్యుసి తీసుకునే నిర్ణయాన్ని కాంగ్రెసు పెద్దలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చేరవేశారని, దాంతో ఆ పార్టీ శాసనసభ్యులు ముందుగానే రాజీనామాలు చేశారని ఆయన అంటున్నారు. ముందుగా రాజీనామాలు చేసి సమైక్యాంధ్ర కోసం పోరాటంలో ముందుండడం తమను దెబ్బ తీసే వ్యూహంగా చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.