చేవెళ్లలో తెలంగాణ అభ్యర్థులు: ఆంధ్ర భార్యలు
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల లోకసభ స్థానంలో పరిస్థితి విచిత్రంగా ఉంది. బలమైన తెలంగాణవాదం చేవెళ్లలో బలంగానే ఉంది. అయితే, ఈ స్థానంలోని ప్రధాన పార్టీల అభ్యర్థుల భార్యలు సీమాంధ్రకు చెందినవారు కావడం విశేషం. పైగా, వారికి విభిన్నమైన రాజకీయ నేపథ్యం ఉంది. అయినా, తమ భర్తల విజయానికి వారు శ్రమిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి పక్కా తెలంగాణ ఉద్యమకారుడు కొండా వెంకటరంగారెడ్డి కుటుంబ సభ్యుడు. విశ్వేశ్వర రెడ్డి సతీమణి సంగీతారెడ్డి చిత్తూరుకు చెందినవారు. కాంగ్రెసు అభ్యర్థి పి. కార్తిక్ రెడ్డి మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు. దివంగత నేత పి. ఇంద్రారెడ్డి వారసుడు. ఆయన సతీమణి వైశాలి స్రవంతి తూర్పు గోదావరి జిల్లాకు చెందినవారు.వైశాలి స్రవంతి తల్లిదండ్రులు కూడా తెలంగాణలోనే పుట్టిపెరిగారు.
తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి. వీరేందర్ గౌడ్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు టి. దేవేందర్ గౌడ్ కుమారుడు. వీరేందర్ గౌడ్ భార్య కర్ణాటకలోని గంగావతికి చెందినవారు. ఆమె తాత కాంగ్రెసు నాయకుడు. తల్లిదండ్రుల కుటుంబం కాంగ్రెసుకు చెందింది అయినా, అత్తారింటికే మద్దతు ఇచ్చే ఉద్దేశంతో ఆమె ఉంది.
కొండా విశ్వేశ్వర రెడ్డి సతీమణి సంగీతా రెడ్డి తన భర్త విజయం కోసం ప్రచారం సాగిస్తున్నారు. ఆమె మహిళలను విస్తృతంగా కలుస్తూ విజయానికి పాటుపడుతున్నారు. కార్తిక్ రెడ్డి సతీమణి కూడా ప్రచారం సాగిస్తూ ముందుకు సాగుతున్నారు. ముగ్గురు అభ్యర్థుల కుటుంబాలు కూడా బలమైన రాజకీయ వారసత్వాన్ని కలిగి ఉన్నవే. చేవెళ్ల లోకసభ స్థానంలో పోటీ ఆసక్తికరంగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు.