ఇదీ బెజవాడ చరిత్ర: పేరు మార్చవద్దని బాబుకు..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధానిగా ప్రకటన వెలువడిన మరుక్షణంలో దేశ, విదేశాల్లో విజయవాడ పేరు మార్మోగుతోంది. వాస్తవానికి కనీసం జిల్లా కేంద్రం కాకపోయినప్పటికీ రాజకీయ, వాణిజ్య, వ్యాపార కూడలిగా రవాణా, సాంస్కృతిక విద్యా కేంద్రంగా దేశంలోనే విశిష్టస్థానం పొందిన విజయవాడకు రెండువేల ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇంద్రకీలాద్రి పర్వతంపై లభించిన క్రీ.శ. 927-933 కాలం నాటి 2వ యుద్ధమల్లుని శాసనం ప్రకారం నేటి విజయవాడ రాజేంద్ర చోళపురంగా భాసిల్లింది.
అప్పటికే బెజవాడ, హెచ్చవాడ, విజయవాటికగా పిలువబడి నేడు విజయవాడగా నిలిచింది. ఇలాంటి నగరంలో రాజధాని ఏర్పడినా పేరు మార్చవద్దంటూ పలువురు కోరుతున్నారు.

శాతవాహనుల కాలం నుంచి విశిష్టమైన సాంస్కృతిక చరిత్ర కలిగి ఉందని పురాతత్వ శాస్తజ్ఞ్రుల అభిప్రాయం. తూర్పు చాళుక్యులు విజయవాడను విస్తృతం చేసి అభివృద్ధి చేశారు. శివ, దుర్గామల్లేశ్వర, కార్తికేయ తదితరుల గౌరవార్థం ఆలయాలు నిర్మించారు. బౌద్ధమతానికి, జైన మతానికి ఒకప్పుడు విజయవాడ కేంద్రం. క్రీస్తుశకం 715-755 మధ్య కాలంలో కుబ్జా 1వ విష్ణువర్ధనరాజు పాలనా కాలంలో ఈ నగరం జైన మతానికి పెట్టిన పేరు. 1వ విజయాదిత్య ఒక పెద్ద శివాలయాన్ని నిర్మించారు.
క్రీస్తు శకం 927-933 మధ్య కాలంలో రాజ్యపాలన చేసిన యుద్ధమల్లుని కాలంలో కార్తికేయుని ఆలయం నిర్మాణం జరిగింది. కాకతీయ గణపతిదేవుడు విజయవాడను వశపర్చుకున్నట్లు శిలాశాసనాలు చెబుతున్నాయి. అయితే 14వ శతాబ్దానికి అది దక్కన్ సుల్తానుల పరమైంది. 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు, గజపతులతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు గజపతుల చేతుల్లోకి వెళ్లింది. తరువాత గోల్కొండ కుతుబ్షాహీలు ఈ ప్రాంతాన్ని పాలించారు.












Click it and Unblock the Notifications