ఎపి, టి రాష్ట్రాల సభల్లో గవర్నర్ భిన్న ప్రసంగం!
హైదరాబాద్: రాష్ట్ర విభజన పైన గవర్నర్ నరసింహన్ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తన ప్రసంగంలో భిన్నంగా స్పందించారు! గవర్నర్గా రెండు రాష్ట్రాల్లో భిన్న వైఖరులు కనిపించాయి. అయితే అది ఆయనకు రాజ్యాంగబద్ధంగా తప్పని స్థితి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రెండు రాష్ట్రాలకు నరసింహనే గవర్నర్.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా కొనసాగుతూ తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా కూడా నరసింహన్ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రెండు రాష్ట్రాల ఉభయ (శాసనసభ, మండలి) సభల్లోనూ ప్రసంగించటం ద్వారా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.
అయితే, విభజన మొదలుకుని అనేక అంశాలపై భిన్నాభిప్రాయాలున్న రెండు రాష్ట్రాల తరఫున ఆయనే మాట్లాడటంతో... ఆ ప్రసంగంలోనూ పలు అంశాల మధ్య వైరుధ్యాలు చోటుచేసుకున్నాయి. రెండు రాష్ట్రాల అసెంబ్లీల్లోను 'నా ప్రభుత్వం' అంటూనే వాటిని ప్రస్తావించారు.
కొన్ని దశాబ్దాలు పోరాడిన కోట్లాది తెలంగాణ ప్రజల కల ఇప్పటికి నెరవేరిందని తెలంగాణ తొలి పౌరుడిగా పేర్కొన్న గవర్నర్... రాష్ట్ర విభజన తీరు ప్రజల మనసులను గాయపరిచిందని ఆంధ్రప్రదేశ్ తొలి పౌరుడి హోదాలో పేర్కొనాల్సి వచ్చింది.
తెలంగాణ ఉద్యమాన్ని కీర్తిస్తూ గవర్నర్ ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వనరులకు సంబంధించి న్యాయబద్దమైన విభజన జరిగితే ఇలాంటి పరిస్థితుల్లో ఉండేవారము కాదని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వాలు ఇచ్చిన స్పీచ్ను ఆయన చదవాల్సి ఉంటుంది. ఒకే గవర్నర్ రెండు రాష్ట్రాల తరఫున ప్రసంగించడం వల్లే ఈ వైరుధ్యం చోటు చేసుకుంది.