పాముకాటు చికిత్సకు ఆరు లక్షలు అడిగారు
హైదరాబాద్: పాము కాటు చికిత్సకు ఓ ఆస్పత్రి ఆరు లక్షల రూపాయలు చార్జ్ చేసింది. దీంతో రోగికి చికిత్స చేయించినవారు దిమ్మెరపోయారు. మేడ్చెల్ హైవేలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి పాము కాటు నుంచి అలా డబ్బులు పిండుకునే ప్రయత్నం చేసింది. గ్యాంగ్ వేపై ఉన్న ఓ పరికరాన్ని తీసుకోవడానికి ఓ మానుఫాక్చరింగ్ కంపెనీ క్యాజువల్ వర్కర్ ప్రయత్నించినప్పుడు అతన్ని పాము కాటు వేసింది. ఈ మేరకు ఆంగ్ల దినపత్రిక దక్కన్ క్రానికల్లో ఆ వార్తాకథనం ప్రచురితమైంది.
వెంటనే అతన్ని పక్కనే ఉన్న క్లినిక్కు తీసుకుని వెళ్లారు. అయితే, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తీసుకుని వెళ్లాలని అక్కడ సూచించారు. మూడు రోజుల పాటు అతను ఆస్పత్రిలో ఉండాల్సి వస్తుందని, దానికి లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయలు ఖర్చువుతాయని వైద్యులు చెప్పాడు. దానికి యూనిట్ మేనేజర్ మనోజ్ కుమార్ అంగీకరించాడు.

వర్కర్ను డిసెంబర్ 18వ తేదీన ఆస్పత్రిలో చేర్చారు. డిసెంబర్ 23వరకు ఆస్పత్రిలో ఉన్నాడు. అతనికి ప్రతి రోజూ 20 వియాల్స్ మేరకు విషానికి విరుగుడు మందు ఇచ్చామని చెప్పారు. అంత మోతాదు మందు ఒక వ్యక్తికి ఎలా ఇస్తారని, ఎంత విషం అతని శరీరంలోకి ఎక్కిందనేది తమకు తెలియదని మనోజ్ కుమార్ అంటున్నాడు.
అయితే, కంపెనీ యజమానులు మూడున్నర లక్షలు చెల్లించిన తర్వాత పాముకాటు చికిత్సకు ఎంత ఖర్చువుతుందని ఇతర వైద్యుల వద్ద ఆరా తీశారు. దాంతో ఆస్పత్రి వైద్యులపై అనుమానం వచ్చి వర్కర్ను మరో వైద్యుడి వద్దకు తీసుకుని వెళ్లారు. అతనికి నయమైందని అతను చెప్పాడు.
వర్కర్ను గాంధీ ఆస్పత్రికి తీసుకుని వెళ్తామంటే ప్రైవేట్ ఆస్పత్రి వర్గాలు నిరాకరించాయని చెప్పారు. రోగికి ఏమైనా అయితే మేమే బాధ్యులమంటూ రాసివ్వాలని పట్టుబట్టారని చెబుతున్నారు. దాంతో ఆస్పత్రిపై కంపెనీ పేట్బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొత్తం మీద, అది చిలికి చిలికి గాలివానగా మారింది. ఈ సంఘటనపై మాట్లాడడానికి ఆస్పత్రి వర్గాలు అందుబాటులో లేవని దక్కన్ క్రానికల్ రాసింది.












Click it and Unblock the Notifications