గోవధ: మొఘల్ కింగ్ బాబర్పై రాజ్నాథ్ ఆసక్తికర విషయం
న్యూఢిల్లీ: గోవధకు బహిరంగ మద్దతు ఇస్తే భారత దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించలేమనే సంగతి మొఘల్ పాలకులు గుర్తించారని, భారతీయుల హృదయాలను కొల్లగొట్టాలంటే గోవధకు మద్దతు పలకవద్దని వారు భావించారని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ శనివారం ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.
మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి బాబర్ భారత దేశంలో గోవుల మాంసాన్ని తింటే, ప్రజల్లో అపఖ్యాతి పొందుతామని భావించారని తెలిపారు. రాజ్యాన్ని పాలించాలంటే గోవధకు బహిరంగ మద్దతు ఇవ్వరాదని తన వీలునామాలో రాసుకున్నాడని చెప్పారు.
మొఘల్ చక్రవర్తుల గురించి తనకు తెలిసిన కొద్ది సమాచారం ప్రకారం... వారికీ నిజం తెలుసునని, గోవధకు బహిరంగ మద్దతు ప్రకటిస్తే, ఎక్కువ రోజులు రాజులుగా ఉండలేమని వారు నమ్మారని తెలిపారు.
ఓకేసారి ఈ రెండు పనులనూ చేయలేమని, ప్రజల హృదయాలను గెలుచుకోవాలంటే, గోమాంస భక్షణ ఆపాలని బాబర్ తన వీలునామాలో రాసినట్టు తెలిపారు. ఈ విషయాన్ని గుర్తించడంలో బ్రిటీష్ ప్రభుత్వం విఫలమైందన్నారు. తుపాకీ తూటాల్లో ఆవు కొవ్వును వాడటం మూలంగానే 1857 సిపాయిల తిరుగుబాటు మొదలైందన్నారు.
ఆయన శనివారం నాడు రాష్ట్రీయ గోదాన్ మహా సంఘ్ నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. భారత్ను ప్రజారంజకంగా పాలించడమా.. లేక గోమాంసాన్ని తినడమా.. ఈ రెండింటిలో ఒకటే సాధ్యమవుతుందని పేర్కొన్నారని రాజ్ నాథ్ తెలిపారు.