‘చంద్రబాబుది రాక్షసచూపు-ఈ జిల్లాపై పడింది’
శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లాలోని పోలాకి మండలంలో జపాన్ కంపెనీ సుమితోమోతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన థర్మల్ పవర్ ప్లాంట్ ప్రతిపాదిత ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం పర్యటించారు.
ప్రశాంతంగావున్న శ్రీకాకుళం జిల్లాలో ఊళ్లులేపేసి ఉద్యోగాలు ఇస్తారా..? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చంద్రబాబు చూపు రాక్షసచూపనీ, శ్రీకాకుళం జిల్లాపై అది పడిందని మండిపడ్డారు. తోటాడ, సన్యాసిరాజుపేట, ఓదిపాడు, గవరంపేట తదితర గ్రామాల్లో పర్యటించి అక్కడి ప్రజలతో మాట్లాడారు.
గతంలో జరిగిన సోం పేట, కాకరాపల్లి వంటి ఘటనలు పునరావృతం కాకముందే ప్రభుత్వం ఇక్కడి థర్మల్ ప్రతిపాదన విరమించుకోవాలని సూచించారు. శ్రీకాకుళం జిల్లా సోంపేటలో థర్మల్ పవర్ ప్రాజెక్టు అనుమతులు రద్దు చేస్తూ జీవో విడుదల చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎందుకు తాత్సారం చేస్తున్నారని నారాయణ ప్రశ్నించారు.
అమరవీరులకు నివాళులు
సోంపేట బీల ప్రాంతంలో థర్మల్ పవర్ప్రాజెక్టు ఏర్పాటుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పోలీసు తూటాలకు బలైపోయిన ముగ్గురు అమరవీరులకు నివాళులర్పిస్తూ మంగళవారం సోంపేట పట్టణంలో భారీ సభ నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ సంఘం, మత్స్యకార ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో కలసి నారాయణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరవీరుల స్తూపాన్ని ఆవిష్కరించిన చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చి 14నెలలు గడుస్తున్నా, అనుమతులు రద్దు చేస్తూ జీవో జారీచేయకపోవడాన్ని తప్పుపట్టారు. ఉద్యమం ఎప్పటికైనా బలహీన పడదా, మరలా ఆ ప్రాంతంలో కర్మాగారాలు స్థాపించడానికి అవకాశం దొరకదా? అనే ఉద్దేశంతో బాబు ఉన్నట్లు కనిపిస్తోందన్నారు.
సిపిఎం రాష్ట్రకార్యదర్శి మధు మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రభుత్వం 1107 జీవో రద్దు చేయకుండా మరలా ఆనాటి కాల్పుల సంఘటనకు సంబంధించి 720 మందిపై కేసులు పెట్టడానికి సిద్ధం కావడం చూస్తుంటే పరిస్థితి ఎలాఉందో అర్థం అవుతోందన్నారు. సభలో పాల్గొన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సాయిరాజ్ మాట్లాడుతూ.. 1107 జీవో రద్దు అయ్యేంతవరకు పోరాటం చేస్తామని అన్నారు.