257మంది ప్రాణాలుతీసి! ఎన్నోసార్లు మెమెన్ ఆరాటం
న్యూఢిల్లీ: 1993 ముంబై పేలుళ్ల కేసులో దోషి యాకుబ్ మెమెన్ పలుమార్లు మరణ శిక్ష రద్దు కోసం ప్రయత్నించాడు. ముంబై పేలుళ్లకు అతను ఆర్థిక సాయం చేశాడు. తనకు తెలిసిన వారి నుండి లక్షలు వసూలు చేసి పేలుళ్లకు ఆర్థిక సాయం చేశాడు.
ఈ పేలుళ్లలో 257 మంది మృతి చెందగా, 713 మంది వరకు గాయపడ్డారు. ఇంతమందిని పొట్టన పెట్టుకోవడానికి కారణమైన యాకూబ్ మెమెన్ పలుమార్లు తన కొన ఊపిరి కోసం ప్రయత్నాలు చేశాడు.
ఉరి నుంచి తప్పించుకునేందుకు అతను 2013లో తొలిసారి పిటిషన్ దాఖలు చేశాడు. 2013 జూలై 30న దానిని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.
ఆ తర్వాత యాకూబ్ మెమెన్ తరఫున అతడి సోదరుడు తొలిసారి రాషఖ్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి క్షమాభిక్ష పిటిషన్ సమర్పించాడు. దీనిన గత ఏడాది ఏప్రిల్ 11న రాష్ట్రపతి తిరస్కరించారు.
మరణ శిక్ష తీర్పును సమీక్షించాలని కోరుతూ యాకూబ్ మెమెన్ రెండోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కోర్టు దానిని తిరస్కరించింది.
దీంతో తీర్పును సవరించాలని క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ నెల 21న సుప్రీం కోర్టు దానిని కొట్టేసింది. అతను వెంటనే మహారాష్ట్ర గవర్నర్కు క్షమాభిక్ష అభ్యర్థన దాఖలు చేశాడు.
అలాగే ఉరిశిక్ష పైన స్టే కోరుతూ 23న సుప్రీం కోర్టులో మళ్లీ పిటిషన్ దాఖలు చేశాడు. దీనిని బుధవారం నాడు సుప్రీం కోర్టు కొట్టివేసింది. అదే సమయంలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర రావు క్షమాభిక్షను తోసిపుచ్చారు.
ఆ వెంటనే బుధవారం రాష్ట్రపతికి మరోసారి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నాడు. సుప్రీం కోర్టులో బుధవారం అర్ధరాత్రి అర్ధరాత్రి వాదనలు జరిగాయి. మొత్తంగా సుప్రీం కోర్టులో నాలుగుసార్లు, రాష్ట్రపతి వద్ద రెండుసార్లు, మహారాష్ట్ర గవర్నర్ వద్ద ఒకసారి యాకూబ్ మెమెన్ ప్రయత్నాలు చేశాడు.