సందడే లేదు: తెల్లారితే పెళ్లి.. ఏటీఎం వద్దే పెళ్లికొడుకు, ఫ్యామిలీ!
న్యూఢిల్లీ: నల్లధనం, నకిలీ కరెన్సీకి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో సామాన్యులకూ ఇబ్బందులు తప్పడం లేదు. కాగా, నల్లధనం నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఓ వైపు సమర్థిస్తూనే... తమ బాధలను మరోవైపు వెళ్లగక్కుతున్నారు సామాన్యులు.
తాజాగా, న్యూ ఢిల్లీలో ఓ కుటుంబం పడిన వేదన చూస్తే ఎవరికైనా 'అయ్యో పాపం' అనిపించకమానదు. సాధారణంగా ఎవరింట్లో అయినా పెళ్లి ఉంటే.. అందరూ ఇంటి వద్దే ఉంటూ, సరదాగా గడిపేస్తుంటారు.

కానీ, ఇక్కడ మాత్రం ఆ కుటుంబంలో సరదా సన్నివేశాలే కరువయ్యాయి. వీరి ఇంట్లో తెల్లారితే పెళ్లి. కానీ, పెళ్లి ఖర్చులకు డబ్బులు చేతిలో లేకపోవడంతో.. పెళ్లికొడుకుతో పాటు, అతని ఇద్దరు సోదరులూ అర్ధరాత్రి నుంచి ఈ ఉదయం వరకు ఏటీఎం సెంటర్ వద్దే గడిపారు.
పెళ్లి సమయంలో తనకు ఈ బాధలు ఏంటో అని జాతీయ మీడియా వద్ద వరుడు సునీల్ వాపోయాడు. డబ్బు కోసం ఏటీఎం సెంటర్ల వద్ద తన కుటుంబ సభ్యులంతా ఎంతో కష్టపడ్డామని, అయినా తగిన ఫలితం మాత్రం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కొత్త నోట్లు మరింతగా వాడుకలోకి తెచ్చి ప్రజలకు అందుబాటులో ఉండేలా చేస్తే ఇలాంటి సమస్యలు ఉండవని సునీల్ అభిప్రాయపడ్డాడు.












Click it and Unblock the Notifications