పచ్చగడ్డి భగ్గు: చేతులు కలిపిన ప్రత్యర్థులు
మహబూబ్నగర్: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)పై, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావుపై గుక్క తిప్పుకోకుండా విమర్శనాస్త్రాలు సంధించడంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి దిట్ట. ఆయన ఫక్తు కెసిఆర్ వ్యతిరేకిగా ముద్ర వేయించుకున్నారు.
లక్ష్మారెడ్డి టిఆర్ఎస్ నాయకుడు, కెసిఆర్ ప్రభుత్వంలో మంత్రి. లక్ష్మారెడ్డికి, రేవంత్ రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అటువంటి వారిద్దరు చేతులు కలిపుకున్నారు. ఒకే వేదికపై కూర్చున్నారు. మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని బాసలు చెసుకున్నారు.
ఈ అరుదైన ఘటన మహబూబ్నగర్ జిల్లా కొడంగల్లో చోటు చేసుకుంది. రేవంతరెడ్డి నియోజకవర్గమైన కొడంగల్, అంగడి రాయిచూర్ల్లో ఇరువురూ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొడంగల్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం శంకుస్థాపనకు వచ్చిన మంత్రి లక్ష్మారెడ్డి, రేవంతరెడ్డి కరచాలనం చేసుకున్నారు.
"బాగున్నారా.. " అంటూ పలకరించుకున్నారు. సభలు, సమావేశాల్లో ఒకే వేదికపై కూర్చున్నారు. రోడ్డు విస్తరణ పనులకు మంత్రి సహకారాన్ని రేవంత్ రెడ్డి కోరగా, దానికేముంది.. పూర్తి సహకారం ఉంటుందంటూ లక్ష్మారెడ్డి భరోసా ఇచ్చారు.