ఫస్ట్ క్లాస్ చిన్నారితో థర్డ్ క్లాస్ కుర్రాడి ఫైటింగ్, మృతి
హైదరాబాద్: హేళనలతో బడిలో చిన్నారుల మధ్య రగిలిన వివాదం దాడులకు కారణమైంది. చివరకు ఒకరి ప్రాణాలను బలిగొంది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మారుపేర్లతో పిలుచుకోవడం ఇద్దరు చిన్నారుల మధ్య కుస్తీకి దారి తీయడం, ఒకరు మృతి చెందడం విషాధకరం.
నన్ను మారుపేరుతో పిలుస్తావా? అంటూ ఆ ఆరేళ్ల విద్యార్థి తిడితే, నన్నే తిడతావా? అంటూ ఆ విద్యార్థి చేయి చేసుకున్నాడు. ఇద్దరూ కలియబడ్డారు. ఈ ఘటనలో ఆరేళ్ల చిన్నారి అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. నాలుగు రోజులుగా ఆస్పత్రిల్లో చికిత్సపొందుతూ మృతి చెందాడు.
టోలిచౌకీ ఐఏఎస్ కాలనీకి చెందిన అబ్దుల్ ముజీబ్ ట్యాక్సీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు. చిన్నవాడు ఇబ్రహీం (6) స్థానికంగా ఉన్న ప్రయివేటు పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. చిన్నపాటి వర్షం పడ్డా ఇబ్రహీంకు జలుబు చేస్తుంది.
అలా పాఠశాలకు వెళ్లిన ప్రతిసారి అదే స్కూల్లో మూడో తరగతి చదువుతున్న ఓ విద్యార్ధి (10) చీమిడి ముక్కు ఇబ్రహీం అంటూ ఏడిపించేవాడు. అయితే ఈ నెల 12 వ తేదీన స్కూల్ లంచ్ విరామంలో ఇబ్రహీంను ఉద్దేశించి సదరు విద్యార్థి అలాగే పిలిచి, గేలి చేశాడు.
దీంతో ఆగ్రహించిన ఇబ్రహీం అతడిని తిట్టాడు. దీంతో గొడవ మొదలైంది. ఇద్దరూ కలియబడ్డారు. ఈ క్రమంలో ఆ విద్యార్థి ఇబ్రహీం పొట్ట కింది భాగంలో బలంగా తన్నడంతో ఆ చిన్నారి ఒక్కసారిగా కుప్పకూలాడు. టీచర్లు ఇబ్రహీంను ఆసుపత్రికి తరలించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు.

మెరుగైన వైద్యం కోసం నిలోఫర్కు తరలించారు. నాలుగు రోజులుగా మృత్యువుతో పోరాడిన ఇబ్రహీం శనివారం మరణించాడు. తండ్రి అబ్దుల్ ముజీబ్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనకు బాధ్యుడైన విద్యార్థిపై 304ఎ(2) సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఇదిలా ఉండగా, వారిద్దరు తెలిసీ తెలియకుండా గొడవ పడ్డారు. ఇబ్రహీంను కొట్టి, అతని మృతికి కారణమైన విద్యార్థి మాట్లాడుతూ.. ఇబ్రహీం చచ్పిపోయాడా, చచ్పిపోయాడు అంటే ఏమిటి అని అడుగుతున్నాడు. మృతి చెందిన బాలుడు ఒకటో తరగతి చదువుతుండగా, ఇతడు మూడో తరగతి చదువుతున్నాడు. పోలీసులకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. పోలీసులు స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు.












Click it and Unblock the Notifications