బాబు సర్వే: టిడిపి స్థితిపై దిమ్మతిరిగే ఫలితం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఓ ప్రముఖ సంస్థ ద్వారా రహస్య సర్వే నిర్వహించారని, ఆ సర్వేలో టిడిపి పరిస్థితి దారుణంగా ఉందని తేలిందని ప్రచారం సాగుతోంది. మంత్రులు, శానససభ్యుల పనితీరుపై సర్వేలు చేయించిన చంద్రబాబు ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్తే టిడిపికి ఎన్ని సీట్లు వస్తాయో తెలుసుకోవడానికి రహస్యంగా ఓ సర్వే చేయించినట్లు చెబుతున్నారు.
ఈ విషయాన్నిఒక ప్రముఖ మీడియా బయటపెట్టింది. తన వద్ద ఉన్న విశ్వసనీయ సమాచారంతో కథనం రాసినట్టు వెల్లడించింది. అయితే సర్వే ఫలితాలను చూసి చంద్రబాబు అవాక్కయినట్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ కేవలం 51 స్థానాల్లో మాత్రమే విజయం సాధిస్తుందని సర్వే తేల్చినట్టు పుకార్లు షికారు చేస్తున్నాయి.
ఈ స్థితిలో చంద్రబాబు పార్టీ కీలక నేతలతో సుధీర్ఘ సమావేశం నిర్వహించారని అంటున్నారు. పరిస్థితి ఎందుకు ఇంతగా దెబ్బతింది?, ఏం చేయాలి?, ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణాలు ఏమిటి అనే విషయాలపై చర్చించారని ఆ మీడియా సంస్థ రాసింది.
ఎన్నికల్లో తటస్థ ఓటర్లు చంద్రబాబు వైపు మొగ్గారని, ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదని సర్వేలో తేలినట్టు చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు 51 స్థానాలు మాత్రమే గెలవడం అంటే అధికారాన్ని కోల్పోవడం తప్పదు. దీంతో చంద్రబాబు నష్టనివారణ చర్యలకు పూనుకున్నట్లు చెబుతున్నారు.