సర్వే షాక్: బిజెపికి కటీఫ్ చెప్తే టిడిపికి ఎక్కువ సీట్లు, జగన్, పవన్ వెనకబాటు!
ఓ న్యూస్ ఛానల్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగితే, 2014 ఎన్నికల కన్నా మంచి మెజారిటీతో తెలుగుదేశం పార్టీ విజయం .
అమరావతి: ఓ న్యూస్ ఛానల్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగితే, 2014 ఎన్నికల కన్నా మంచి మెజారిటీతో తెలుగుదేశం పార్టీ విజయం సాధించి మరోసారి అధికారంలోకి వస్తుందని ఆ తెలుగు న్యూస్ ఛానల్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
అయితే, ప్రస్తుతం తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు సంయుక్తంగా ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, తెలుగుదేశం-బీజేపీ కలసి పోటీ చేస్తే 120 అసెంబ్లీ సీట్లు, బీజేపీకి కటీఫ్ చెప్పి, తెలుగుదేశం ఒంటరిగా పోటీ చేస్తే 140 సీట్ల వరకూ వస్తాయని ఈ సర్వే పేర్కొనడం కొత్త చర్చకు దారితీసింది.
బీజేపీతో విడిపోతే, ముస్లిం, మైనారిటీ వర్గాల ఓట్లు తెలుగుదేశం పార్టీకి పడతాయని, ఆ కారణంగానే చంద్రబాబు బలం మరింతగా పెరుగుతుందన్నది తెలుగు న్యూస్ ఛానల్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సర్వే చెప్పిన కారణం. కాగా, సర్వే వాస్తవాలకు దూరంగా ఉందని, తమతో కటీఫ్ చెబితే, తెలుగుదేశంకు పుట్టగతులుండవని బీజేపీ నేతలు హెచ్చరించారు.
ఫిరాయింపు రాజకీయాలను ప్రజలు చూస్తున్నారని, తెలుగుదేశం పార్టీకి మరోసారి ఓటేసే ఆలోచనలో ప్రజలు లేరని మరోపక్క వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.
కాగా, ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం అనుసరించిన వైఖరి, ప్యాకేజీపై అస్పష్టత, నోట్ల రద్దు నిర్ణయం ఇలా చాలా అంశాలు బీజేపీపై ప్రజలు పెంచుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేశాయని సర్వే తెలిపింది. ముఖ్యంగా ఏపీకి హోదా విషయంలో కేంద్రం అనుసరించిన వైఖరి ప్రజలను తీవ్రంగా బాధించిందని పేర్కొంది. ఈ అసంతృప్తి వల్లే బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేస్తే, ఓట్లేయడానికి కొందరు ప్రజలు సిద్ధంగా లేరని స్పష్టం చేసింది.
అయితే, ఈ సర్వే కేవలం గడచిన రెండున్నరేళ్ల పాలనపై ప్రజల అభిప్రాయాలను తెలియజెప్పే ప్రయత్నం మాత్రమే. ఇంకా రెండున్నరేళ్లు ఉంది. మరి ఈ రెండున్నరేళ్లలో ఏపీ విషయంలో కేంద్రం తీసుకునే చొరవే, ఆ పార్టీ భవిష్యత్ను నిర్ణయించే అవకాశం లేకపోలేదు.
టిడిపి వైపే జనం మొగ్గు కానీ.. జగన్ తగ్గినా, పట్టునిలుపుకున్నారు
ఏపీ ప్రజల మొగ్గు ఇప్పటికీ తెలుగుదేశంవైపే ఉన్నా... గత ఎన్నికలతో పోలిస్తే మాత్రం ఆ పార్టీకి ఓట్లు పెరగలేదు. ఏబీఎన్ సర్వే నిర్వహించిన 23 స్థానాల్లో గత ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమి 46.63 శాతం ఓట్లు పొందింది. తాజా సర్వేలో 46.53 శాతం వచ్చాయి. అయితే, మొత్తంగా సాధించే సీట్ల సంఖ్యలో మాత్రం కొంత మెరుగుదల కనిపించింది. అప్పుడు కూటమికి 106 (102+4) అసెంబ్లీ స్థానాలు రాగా, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 120 వస్తాయని సర్వే తేల్చింది. ఇందుకు కారణం... ప్రతిపక్షమైన వైసీపీ మరింత బలహీనపడడమే.
ఆ పార్టీకి ఓట్లు, సీట్లు కూడా భారీగా తగ్గే అవకాశం ఉన్నట్టు సర్వే అంచనా వేసింది. సర్వే నిర్వహించిన 23 నియోజకవర్గాల్లో 2014లో వైసీపీకి 43.2 శాతం ఓట్లు వచ్చాయి. అప్పుడు ఆ పార్టీ నవ్యాంధ్రలో 67 స్థానాలు గెలుచుకుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, ఓట్లు 36.8 శాతానికి, సీట్ల సంఖ్య 50కి పడిపోతుందని సర్వే లెక్క వేసింది.
పార్టీల రాజకీయ ప్రాబల్యాలు, సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ రాజకీయాలను పరిగణనలోకి తీసుకుంటూ వివిధ ప్రాంతాలు, జిల్లాల్లోని 23 నియోజకవర్గాల్లో శాసీ్త్రయ పద్ధతిలో ఈ సర్వేను నిర్వహించారు. ఇందులో 16 టీడీపీ ప్రాతినిధ్యం వహిస్తున్నవి కాగా, 7 వైసీపీ చేతిలో ఉన్నవి. విశేషం ఏమిటంటే.. ఈ 23 నియోజకవర్గాల్లో ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే.. ఫలితాల సరళి యథాతథంగా ఉంటుందనీ... మళ్లీ కూడా టీడీపీకి 16, వైసీపీకి ఏడే వస్తాయని.. గెలిచే స్థానాలు మాత్రం కొన్ని అటూఇటూ మారవచ్చని సర్వే తేల్చింది.
గత ఎన్నికల్లో వచ్చిన వాటికన్నా, వైసీపీకి ఇప్పుడు 6.4 శాతం ఓట్లు తగ్గనున్నట్టు సర్వే లెక్క వేసింది. దీనివల్ల జగన్ పార్టీ మొత్తమ్మీద 14-17 సీట్లు కోల్పోతుందని, అవి టీడీపీ-బీజేపీ ఖాతాలో పడతాయని అంచనా వేసింది. సర్వే జరిగిన 23 స్థానాల్లో 11 చోట్ల కూటమి బలం పెరిగింది. 11 చోట్ల తగ్గింది. అయితే విచిత్రంగా టీడీపీ బలం తగ్గిన సీట్లలో వైసీపీ బలపడలేదు. అంటే ఆ లబ్ధిని మరే శిబిరమో పొందిందన్నమాట. ఇది బహుముఖ పోరుకు ఒక సంకేతం. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఇలా చీలిపోవడమే తెలుగుదేశానికి కొంత లబ్ధి చేకూర్చనుంది.
గత ఎన్నికల్లో పైచేయి సాధించిన ప్రాంతాల్లో, ఓట్ల శాతం స్వల్పంగా తగ్గినప్పటికీ, ఇప్పటికీ వైసీపీ పట్టు కొనసాగుతోంది. నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో, మైనారిటీ ప్రాబల్యమున్న ప్రదేశాల్లో ఇప్పటికీ వైసీపీ ఆధిక్యమే ఉంది. ఇక్కడ జగన్ ప్రాబల్యాన్ని బద్దలు కొట్టడంలో తెలుగుదేశం విఫలమవుతున్నట్టు స్పష్టమైంది. చిత్తూరులో హోరాహోరీ పరిస్థితే కొనసాగుతుండగా, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రల్లో తెలుగుదేశం పైచేయి స్పష్టంగా కనిపించింది.
పవన్కు ఆదరణ అంతంత మాత్రమే!
సీమాంధ్రుల అభీష్టానికి వ్యతిరేకంగా రాష్ట్రాన్ని విభజించి, ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ ఇప్పుడప్పుడే కోలుకునే దాఖలాలు కనిపించలేదు. ఓట్ల సంఖ్య పెరగడమే (2.57 నుంచి 6.1 శాతానికి) కొంత ఊరట. అయితే, ఓట్ల శాతం ఇప్పటికీ రెండంకెలకు (డబుల్ డిజిట్కు) చేరలేదు. ఇక సీమాంధ్ర జన మనోగతాన్ని ప్రతిఫలిస్తున్నానంటూ రాజకీయ బరిలో నిలిచిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు, సభలకు వచ్చినంతగా, ప్రజల్లో ఆదరణ కనిపించలేదు.
దాదాపు 4 శాతం మందే జనసేనాధిపతికి మద్దతు పలుకుతున్నట్టు సర్వే తేల్చింది. వీరిలో విద్యార్థులే అత్యధికం! ఇక... ప్రజాసమస్యలపై పోరాడే వామపక్షాలు రాజకీయ ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితి నెలకొందని సర్వేలో తేలింది. లెఫ్ట్ వైపు కేవలం 2.90 శాతం మంది మాత్రమే నిలిచినట్లు స్పష్టమైంది. ఏ వర్గంలోనూ పెద్దగా ఆదరణ కనిపించకపోవడం వామపక్షాల వారికి ఆందోళన కలిగించే విషయమే.