పిల్: బెజవాడలో చంద్రబాబు ఇంటికి చిక్కులు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సమీపంలో గల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఇంటికి చిక్కులు ఎదురవుతున్నాయి. అమరావతి సమీపంలోని ఉండవల్లి వద్ద కృష్ణానది కరకట్టపై నిర్మించిన నివాసంలో చంద్రబాబు ఉంటున్నారు. ఇప్పుడు ఈ ఇంటిపై హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. వైయస్సార్ కాంగ్రెసు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ పిల్ వేశారు.
కరకట్ట నిబంధనకు తుంగలో తొక్కి అక్రమంగా నిర్మించిన కట్టడాలపై ఈ పిల్ దాఖలు చేశారు. పిల్లో పొందుపరిచిన అక్రమ కట్టడాల్లో ముఖ్యమంత్రి నివాసం కూడా ఉంది. పిల్ను విచారణకు స్వీకరించిన కోర్టు - నిర్మాణం అక్రమమా సక్రమమా అన్నదానిపై వారంలో నివేదిక ఇవ్వాలని స్థానిక తహసీల్దార్ను ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
రాష్ట్ర విభజన ఉద్యమం నడుస్తున్న సమయంలో అదే అదనుగా కొందరు బడాబాబులు కృష్ణా నది వరద కట్టపై భారీ భవంతులు కట్టేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ అక్రమకట్టడాలపై హడావిడి చేశారు. కూల్చేస్తామంటూ నోటీసులు ఇచ్చారు. కానీ అది జరగలేదు.
అక్రమ నిర్మాణాలపై వివాదం నడుస్తుండగానే ఉండవల్లి వద్ద కృష్ణానది వరద కట్టపై ఎకరం 25 సెంట్ల విస్తీర్ణంలో నిర్మించిన ఒక భవంతిని చంద్రబాబు స్వాధీనం చేసుకున్నారు. ఈ భవనాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎయిర్కోస్తా విమాన సంస్థ అధినేత లింగమనేని రమేష్ అక్రమంగా నిర్మించారు. అదే అక్రమ నిర్మాణాన్ని ప్రస్తుతం చంద్రబాబు అధికార నివాసంగా వాడుతున్నారు.
వరదకట్టపై అక్రమనిర్మాణాల విషయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నదికి 200 మీటర్ల పరిధిలోనే వరదకట్టపై నిర్మాణాలు చేపట్టడంపై మండిపడింది. వెంటనే వాటిని కూల్చివేయాలని ఆదేశించింది. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు అమలు చేస్తే చంద్రబాబు అధికార నివాసాన్ని కూల్చివేయాల్సి ఉంటుంది. అందుకే ఏకంగా చట్టాన్నే మార్చేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. చంద్రబాబు నివాసానికి ఇబ్బంది లేకుండా మాస్టర్ ప్లాన్లో మార్పులు చేసేందుకు సిద్ధమయ్యారు.
ఈ నేపథ్యంలో అక్రమకట్టడాలపై ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తాను నిప్పునని చెప్పుకునే చంద్రబాబు అక్రమ కట్టడంతో ఎలా ఉన్నారని రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. వెంటనే ఇంటిని ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. మొత్తం 60 ఎకరాల్లో అక్రమ కట్టడాలు నిర్మించారని ఎమ్మెల్యే ఆరోపించారు.