వైజాగ్ లో జగన్ కు అవమానం..! : ప్రోటోకాల్ ను లెక్కచేయని అధికారులు..?
విశాఖపట్నం : పార్టీలతో సంబంధం లేకుండా విధులు నిర్వర్తించాల్సిన ప్రభుత్వాధికారులు అధికార పార్టీ మెప్పు కోసం ప్రతిపక్ష నేతల పట్ల అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రోటోకాల్ ను సైతం పట్టించుకోకుండా అధికారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరు విమర్శల పాలవుతోంది.
ఇంతకీ అసలు విషయమేంటంటే.. ఏపీలో అధికారుల తీరు ప్రతిపక్ష వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని అవమానించే విధంగా తయారైంది. విశాఖలో జగన్ రెండు రోజుల పర్యటన నేపథ్యంలో అధికారులు ఆయనకు కల్పించాల్సిన సౌకర్యాలను గాలికొదిలేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
సాధారణంగానే ప్రతిపక్ష నేతకు కేబినెట్ హోదా ఉంటుంది కాబట్టి.. ఆయా జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు భద్రతను, వాహనాలను అక్కడి స్థానిక అధికారులే సమకూర్చాల్సి ఉంటుంది. అయితే విశాఖ అధికారులు మాత్రం జగన్ విషయంలో అరకొర పనులతో సరిపెట్టేశారు. సోమవారం రాత్రి జగన్ బస చేసిన సర్క్యూట్ గెస్ట్ హౌజ్ ఎదుట కేవలం ఒక్క ఏఆర్ కానిస్టేబుల్ ను మాత్రమే విధుల్లో పెట్టడం ఆరోపణలకు తావిస్తోంది.
ప్రతిపక్ష నేత వచ్చినప్పుడు అన్ని అవసరాలు సమకూర్చాల్సిన బాధ్యత స్థానిక తహశీల్దార్ పైనే ఉంటుంది. కానీ జగన్ పర్యటనకు రాగానే తహశీల్దార్ సుధాకర్ నాయుడు గ్రామాల పర్యటన పేరుతో అందుబాటులో లేకుండా పోయారు. ఇక మర్యాదపూర్వకంగా ప్రతిపక్ష నేతను కలవాల్సిన డీఆర్వో సుధాకర్ రెడ్డి కూడా పర్యటన సందర్బంగా రెండు రోజులు సెలవులు మీద విధుల్లో లేకుండా వెళ్లిపోయారు.
ఇకపోతే ప్రతిపక్ష నేతకు సమకూర్చాల్సిన వాహనం విషయంలోను అధికారులు అలసత్వాన్ని ప్రదర్శించారు. కండిషన్ సరిగా లేని ఓ వాహనాన్ని జగన్ పర్యటన కోసం కేటాయించారు. అందులో ఏసీ కూడా లేకపోయినప్పటికీ జగన్ అందులోనే పర్యటనకు సిద్దమయ్యారు. అయితే కొంత దూరం వెళ్లాక వాహనమే ఆగిపోవడంతో.. ఇక చేసేదేమి లేక మరో ప్రైవేటు వాహనంలో వెళ్లిపోయారు జగన్. అనంతరం విషయం తెలుసుకున్న కలెక్టరేట్ అధికారి ప్రకాశరావు మరో వాహనాన్ని జగన్ కోసం పంపించారు.
ఇలా భద్రత విషయంలోను.. వాహనం విషయంలోను.. అలాగే ప్రోటోకాల్ ను అధికారులు పక్కనబెట్టేయడంతో ప్రతిపక్ష నేతల అధికారుల అలసత్వం ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నదే అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రభుత్వాధికారులంతా అధికార పార్టీ వ్యక్తుల్లా పనిచేస్తున్నారన్న విమర్శలు మూటగట్టుకుంటున్నారు విశాఖ అధికారులు.