‘ఏపీ ఇక హ్యాపీ’: చంద్రబాబు సంచలన నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరో సంచలన నిర్ణయానికి తెరతీశారు. సంతోషానికో శాఖ ఏర్పాటు చేసేందుకు ఆయన ఇప్పటికే కసరత్తులను మొదలుపెట్టారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరో సంచలన నిర్ణయానికి తెరతీశారు. సంతోషానికో శాఖ ఏర్పాటు చేసేందుకు ఆయన ఇప్పటికే కసరత్తులను మొదలుపెట్టారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. రాష్ట్ర ప్రజలను సంతోషంగా ఉంచేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వ్యంలో ఒక శాఖకు రూపకల్పన జరుగుతోంది.

హ్యాపీనెస్ ఇండెక్స్
ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణ సందర్భంగా ‘హ్యాపీనెస్ ఇండెక్స్' పేరుతో ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబునాయుడు సంకల్పించారు. అంతేగాక, దాన్ని ముఖ్యమంత్రే స్వయంగా పర్యవేక్షించనున్నారు.

దేశంలోనే తొలిసారి ఇక్కడే..
దేశంలో హ్యాపీనెస్ ఇండెక్స్కు సంబంధించి ఓ విభాగాన్ని తొలిసారిగా మధ్యప్రదేశ్ ఏర్పాటు చేసింది. అక్కడ వివిధ రకాల ప్రశ్నలను ముద్రించి, వాటికి వచ్చే సమాధానాల ఆధారంగా హ్యాపీనెస్ ఇండెక్స్ను మదింపు చేస్తున్నారు. ఆ రాష్ట్రానికి సంబంధించి తొలిసారిగా హ్యాపీనెస్ ఇండెక్స్ను వచ్చే ఏడాది ప్రకటించేందుకు అక్కడి ముఖ్యమంత్రి శివరాజ్ చౌహన్ ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రజల సంతోష మెరుగు కోసం..
ఓ అంతర్జాతీయ సంస్థ గత నెలలో ప్రకటించిన వివరాల ప్రకారం హ్యాపీనెస్ ఇండెక్స్లో భారత్ 122వ స్థానంలో ఉంది. నార్వే మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజల సంతోష సూచికను మెరుగుపరిచేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

భూటాన్ స్ఫూర్తిగా..
భూటాన్ నేషనల్ హ్యాపీనెస్ ఇండెక్స్ స్ఫూర్తిగా 2029 విజన్ డాక్యుమెంట్లో హ్యాపీనెస్ ఇండెక్స్ను ప్రభుత్వం చేర్చింది. భూటాన్లో 9 అంశాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుని అక్కడి ప్రజల హ్యాపీనెస్ ఇండెక్స్ను మదింపు చేస్తున్నారు. మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం, కాలాన్ని ఉపయోగించుకునే తీరు, విద్య, సుపరిపాలన, గ్రామాల్లో సామాజిక అభివృద్ధి, సాంస్కృతిక వైవిధ్యం, సమస్యల నుంచి త్వరగా బయటపడగలగడం, పర్యావరణం, జీవనప్రమాణాలు, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని హ్యాపీనెస్ ఇండెక్స్ను లెక్కిస్తారు.

ఆదాయం పెంచడంతోనే..
ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచూ హ్యాపీనెస్ ఇండెక్స్ గురించి తన ప్రసంగాల్లో ప్రస్తావిస్తున్నారు. ఈసారి ఏకంగా ఒక విభాగాన్నే ఏర్పాటు చేస్తున్నారు. ప్రజల ఆదాయాన్ని పెంచడం ద్వారా కూడా జీవితాల్లో సంతోష స్థాయి పెరుగుతుందని సిఎం అంచనా వేస్తున్నారు. ఇందులోభాగంగా ప్రతి కుటుంబానికి నెలవారీ కనీస ఆదాయం 10వేల రూపాయలు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

త్వరలోనే..
ఇటీవల జరిగిన ఫ్యూచర్ డీకోడెడ్ సదస్సులో కూడా ముఖ్యమంత్రి ఈ అంశాన్ని ప్రస్తావించారు. నిర్ణీత కాలానికి వివరాల సేకరణ ద్వారా ఈ ఇండెక్స్ను మదింపు చేసే యోచన ఉంది. ఈ శాఖకు సంబంధించి ఇంకా విధివిధానాలపై స్పష్టత రానప్పటికీ, త్వరలో నిర్ణయం వెలువడవచ్చని భావిస్తున్నారు. ఈ శాఖ ఏర్పడిన తర్వాత ఏపీలో హ్యాపీనెస్ పెరిగే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు.












Click it and Unblock the Notifications