నయీం పెంపుడు కుక్కలు ఎక్కడ?: పోలీసులకే అంతుచిక్కక.. డెన్స్ అన్నీ నిర్మానుష్యం!
ఆపై పోలీసులే వాటిని తీసుకెళ్లారని కెన్నల్ నిర్వహకులు, లేదు.. జంతు సంరక్షణ విభాగం అధికారులే తీసుకెళ్లారని పోలీసులు చెబుతున్నారు. దీంతో ఇప్పుడవి ఎక్కడున్నాయనేది స్పష్టత లేకుండా పోయింది.
హైదరాబాద్: కరడుగట్టిన నేరస్తుడు.. అధికార పార్టీ నాయకులనే వణికించిన గ్యాంగ్ స్టర్ నయీం హతమై రేపటితో సంవత్సరం పూర్తవుతుంది. గతేడాది అగస్టు 8న షాద్ నగర్ శివారులోని మిలీనియం టౌన్ షిప్ లో నయీంను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే.
నయీం కుడి భుజం 'శేషన్న' జాడను పసిగట్టిన పోలీసులు?
నయీం ఎన్ కౌంటర్ తర్వాత ఎంతోమంది వ్యాపారులు, బడాబాబులు ఊపిరి పీల్చుకోగా.. అతని నేర సామ్రాజ్యానికి సంబంధించి బయటకు రాని చీకటి కోణాలు కూడా ఉన్నట్లు చెబుతారు. నయీం చనిపోయిన తర్వాత నుంచి అతని అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తూ వచ్చాయి. ఆఖరికి చిన్న పిల్లలను సైతం అతను లైంగిక వేధింపులకు గురిచేసిన తీరు అతని కౄర మనస్తత్వాన్ని పట్టించింది.
అయితే ఇంతటి కౄర మనస్తత్వం ఉన్న నయీంకు కుక్కులపై మాత్రం అమితమైన ప్రేమ ఉండేదట. వాటి కోసం ప్రత్యేకంగా వెటర్నరీ డాక్టర్ ను నియమించి మరీ.. డైట్ ప్లాన్ చూసుకునేవాడట.
ఆ రెండు కుక్కలు:
నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని నెక్నంపూర్ అల్కాపురి టౌన్ షిప్ లో ఉన్న ఇంట్లో నయీం రెండు శునకాలను పెంచుకునేవాడు. వీటికి శాండో, కోమి అని పేర్లు పెట్టాడు. కాగా ఈ రెండు కుక్కలు డాల్మటైన్ జాతికి చెందినవి కావడం గమనార్హం. ఈ తరహా శునకాలను సరిహద్దు భద్రత కోసం సైనిక దళాలు వినియోగిస్తుంటాయి.
కుక్కుల కోసం స్పెషల్ డైట్:
తాను ఇష్టంగా పెంచుకున్న రెండు శునకాల కోసం నయీం ప్రత్యేకంగా ఓ వెటర్నరీ డాక్టర్ ను నియమించాడు. ఆయన సూచించిన డైట్ ప్రకారమే వాటికి ఆహారం అందించేవారు. ఇంటి గ్రౌండ్ ఫ్లోర్లో వీటికోసం ప్రత్యేకంగా బోన్లు కూడా ఏర్పాటు చేయించారు. ఎన్ కౌంటర్ తర్వాత నయీం ఇంటిని సీజ్ చేసిన పోలీసులు ఈ రెండు శునకాలను పుప్పాలగూడలోని కెన్నల్ సంరక్షణ కేంద్రానికి తరలించారు.
మిస్టరీ:
దాదాపు నెల రోజుల పాటు ఆ శునకాలు అక్కడే ఉన్నట్లు చెబుతున్నారు. ఆపై పోలీసులే వాటిని తీసుకెళ్లారని కెన్నల్ నిర్వహకులు, లేదు.. జంతు సంరక్షణ విభాగం అధికారులే తీసుకెళ్లారని పోలీసులు చెబుతున్నారు. దీంతో ఇప్పుడవి ఎక్కడున్నాయనేది స్పష్టత లేకుండా పోయింది.
గల్లీకో డెన్:
హైదరాబాద్ నగరంలో చాలాచోట్ల నయీం డెన్ లు ఉన్నాయి. నెక్నంపూర్, అల్కాపురి టౌన్ షిప్ తో పాటు శంషాబాద్, హస్తినాపురం, వనస్థలిపురం, మన్సూరాబాద్, కుంట్లూర్ లో డెన్స్ నయీం డెన్స్ బయటపడ్డాయి. రాష్ట్రంలోనే కాకుండా గోవా, ఏపీ, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లోను నయీం గ్యాంగ్ డెన్స్ గుర్తించారు.
ఈ డెన్స్ అన్నీ నయీం సోదరి, భార్యతో పాటు ప్రధాన అనుచరుల పేర్లతో రిజిస్టర్ అయినట్లు గుర్తించారు. వీటితో పాటు చాలా చోట్ల స్థలాలు, భూములు కూడా వీరి పేరిట రిజిస్టర్ అయి ఉన్నాయి. నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత అతని స్థిరాస్తుల్ని స్వాధీనం చేసుకుంటామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. అది కేవలం సీజ్ కే పరిమితమవడం గమనార్హం. దీంతో ఇప్పుడు నయీమ్ డెన్స్ అన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి.