చంద్రబాబుపై మోడీ వైఖరేమిటి: అసలేం జరుగుతోంది?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పట్ల గానీ, తెలుగుదేశం పార్టీ పట్ల గానీ ప్రధాని నరేంద్ర మోడీ వైఖరి ఏమిటనేది అంతు చిక్కకుండా ఉంది. బిజెపి, తెలుగుదేశం మధ్య నిప్పు రాజేసుకున్నప్పటికీ అది తెగే దాకా రావడం లేదు.
Recommended Video
బిజెపితో తెగదెంపులు చేసుకోవడానికి చంద్రబాబు సిద్ధంగా లేనట్లే కనిపిస్తున్నారు. రాష్ట్రానికి అన్యాయం జరిగిందనే, పోరాటంలో ఎంత వరకైనా పోతామని ఆయన హెచ్చరిస్తున్నారు.
అక్కడి నుంచి ఏమీ రావడం లేదు
చంద్రబాబుపై, ఆయన ప్రభుత్వంపై ఎమ్మెల్సీ సోము వీర్రాజు వంటి ముగ్గురు నలుగురు నాయకులు ఎప్పటికప్పుడు విరుచుకుపడుతున్నారు. కానీ, కేంద్రం నుంచి గానీ, బిజెపి జాతీయ నాయకత్వం నుంచి గానీ ఏ విధమైన విమర్శలు, ఖండనలు రావడం లేదు. రాష్ట్రానికి తాము చాలా చేశామని, ఇక ముందు కూడా చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఒక్కటికి రెండు సార్లు చెప్పారు గానీ ఏ విధమైన వ్యాఖ్యలు చేయలేదు.
అసలు బిజెపి వైఖరి ఏమిటి...
బిజెపి, టిడిపిల మధ్య తెగదెంపులు ఖాయమనే వాతావరణం ఏర్పడినప్పటికీ పరిస్థితి అంత దూరం వెళ్లడం లేదు. చంద్రబాబు తీవ్రమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఇతరర జాతీయ నాయకులు కూడా ఎవరూ మాట్లాడలేదు. అందువల్ల చంద్రబాబుతో తెగదెంపులు చేసుకోవడానికి బిజెపి కూడా సిద్దంగా లేదనే వార్తకథనాలు వస్తున్నాయి. అయితే, చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న మీడియాలో ఇటువంటి వార్తలు వస్తున్నాయి. అలా అని పూర్తిగా ఆ వార్తాకథనాలు కొట్టిపారేయాల్సిన అవసరం కూడా లేదు.
బిజెపి అసలు ఉద్దేశం ఏమిటి....
దక్షిణాది రాష్ట్రాలకు ఎంత చేసినా పార్టీ బలోపేతం అయ్యే అవకాశాలు లేవని బిజెపి నాయకత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందువల్ల ఆ రాష్ట్రాలకు ఎక్కువ ఇవ్వడం ద్వారా ప్రాంతీయ పార్టీలను బలోపేతం చేయడం ఎందుకనే భావనకు బిజెపి జాతీయ నాయకత్వం వచ్చినట్లు తెలుస్తోంది.ఇది నూటికి నూరు పాళ్లు రాజకీయావసరం మేరకు అనుసరిస్తున్న వ్యూహం మాత్రమే.
ఆంధ్రప్రదేశ్కు చేసిన కొద్దీ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత చేసినా ఆ క్రెడిట్ చంద్రబాబుకు వెళ్తుందనే అంచనాకు బిజెపి నాయకత్వం వహించినట్లు తెలుస్తోంది. దానివల్ల చంద్రబాబు బలం పుంజుకుంటున్నారు. దానివల్ల బిజెపి రాష్ట్రంలో ఎదిగే పరిస్థితి లేకుండా పోయింది. ఈ స్థితిలో చంద్రబాబును అదుపు చేయడమే మంచిదనే భావనకు వచ్చినట్లు తెలుస్తోంది. సానుకూలంగా ఉంటూనే చంద్రబాబును అదుపు చేస్తూ తమపై ఆధారపడే విధంగా చేయాలనేది బిజెపి వ్యూహంగా కనిపిస్తోంది
జాతీయ ప్రతినిధిగానే....
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసి అమలు చేసే బాధ్యతను విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబుకు అప్పగించినట్లు చెబుతున్నారు. చంద్రబాబుపై గానీ, తెలుగుదేశం పార్టీపై గానీ తీవ్రమైన వ్యాఖ్యలు చేయకుండా అటు నుంచి విమర్శలను సమాధానంగా మాత్రమే తిప్పికొట్టాలని బిజెపి జాతీయ నాయకత్వం హరిబాబుకు సూచించినట్లు చెబుతున్నారు. తద్వారా బిజెపి ఏం చేసిందో ప్రజల్లోకి వెళ్లడమే కాకుండా చంద్రబాబును అదుపు చేయడానికి వీలవుతుందని భావిస్తున్నట్లు చెబుతున్నారు.