ఒక్కసారి ఈ "జామకాయ రోటి పచ్చడి" తింటే మళ్లీ మళ్లీ కావాలనాల్సిందే !
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా కూరల కంటే పచ్చళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే వారు చాలామందే ఉంటారు. దోసకాయ, గోంగూర, పుదీనా, టమాటో వంటి సంప్రదాయ పచ్చళ్లతో పాటు ఇప్పుడు కొత్త రుచులను కూడా ఇంట్లోనే సులభంగా ట్రై చేస్తున్నారు. అలాంటి ప్రత్యేకమైన, కాస్త డిఫరెంట్ రుచి కలిగిన పచ్చడే జామకాయ రోటి పచ్చడి. వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని ఈ పచ్చడి కలిపితే, భోజనం మరింత రుచిగా మారిపోతుంది. మళ్లీ మళ్లీ కావాలి అనడం పక్కా అంటూ చెబుతున్నారు.
కాగా చింతపండు పులుపు, పచ్చిమిర్చి కారం, జామకాయల సహజమైన తీపి కలయికలో తయారయ్యే ఈ పచ్చడి రుచిలోనూ, ఆరోగ్యంలోనూ ప్రత్యేకమే అంటూ కితాబిస్తున్నారు. తక్కువ పదార్థాలతో, తక్కువ సమయంలో తయారయ్యే ఈ పచ్చడి రోజువారీ భోజనానికి కొత్తదనాన్ని తీసుకొస్తుంది. అంతే కాకుండా జామకాయ పచ్చడి ఆరోగ్య ప్రయోజనాలు కూడా చెప్పుకోవాలి. జామకాయల్లో విటమిన్ C, ఫైబర్ ఎక్కువగా ఉండటంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. చింతపండు జీర్ణశక్తిని పెంచుతుంది. వెల్లుల్లి, పచ్చిమిర్చి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. అందువల్ల ఈ పచ్చడి రుచికరమైనదే కాకుండా ఆరోగ్యకరమైనదిగా కూడా చెప్పవచ్చు. ఈ పచ్చడిని ఎలా చేయాలో మీకోసం ప్రత్యేకంగా..

కావాల్సిన పదార్థాలు:
- జామకాయలు - 500 గ్రాములు (అర కిలో),
- నూనె - 4 టేబుల్ స్పూన్లు,
- పల్లీలు - 2 టేబుల్ స్పూన్లు,
- పచ్చిమిర్చి - 15,
- చింతపండు - 20 గ్రాములు,
- ఉప్పు - తగినంత,
- ఆవాలు - 1 టీ స్పూన్,
- శనగపప్పు - అర టేబుల్ స్పూన్,
- మినపప్పు - అర టేబుల్ స్పూన్,
- ఎండుమిర్చి - 2,
- వెల్లుల్లి రెబ్బలు - 6,
- కరివేపాకు - కొద్దిగా,
- పసుపు - అర టీ స్పూన్,
- కొత్తిమీర - పావు కప్పు.
తయారీ విధానం:
- ముందుగా అర కిలో జామకాయలను శుభ్రంగా కడిగి, గింజలు తీసి చిన్న ముక్కలుగా కోయాలి. చింతపండును కొద్దిగా నీళ్లలో నానబెట్టాలి.
- ఒక పాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి పల్లీలను వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. తరువాత పచ్చిమిర్చి వేసి కాస్త వేగనివ్వాలి.
- వేయించిన పల్లీలు, పచ్చిమిర్చిని మిక్సీ జార్లో వేసి, నానబెట్టిన చింతపండు, ఉప్పు కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి.
- అనంతరం కోసిన జామకాయ ముక్కలు, కొత్తిమీర వేసి బరకగా పచ్చడి పట్టాలి. ఎక్కువ మెత్తగా కాకుండా కొద్దిగా ముక్కలు కనిపించేలా గ్రైండ్ చేస్తే రుచి ఇంకా బాగుంటుంది.
- ఇప్పుడు తాలింపు కోసం మరో పాన్లో మిగిలిన 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి ఆవాలు వేసి చిటపటలాడించాలి. ఆపై శనగపప్పు, మినపప్పు వేసి వేగించాలి.
- ఆ తర్వాత ఎండుమిర్చి ముక్కలు, దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి కాస్త ఫ్రై చేయాలి. చివరగా కరివేపాకు, పసుపు వేసి కలిపి ఈ తాలింపును పచ్చడిలో పోసి బాగా కలపాలి.
అంతే! రుచికరమైన జామకాయ రోటి పచ్చడి సిద్ధం. ఈ పచ్చడిని వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే భలేగా ఉంటుండి. దోస, ఇడ్లీ, రోటి, చపాతీలకు కూడా ఇది అద్భుతంగా సరిపోతుంది.
అదనపు టిప్స్:
ఎక్కువ రోజులు నిల్వ ఉంచాలంటే కొద్దిగా నువ్వుల నూనె వాడితే మంచిది.
కారం తక్కువ కావాలంటే పచ్చిమిర్చి సంఖ్య తగ్గించవచ్చు.
జామకాయ పూర్తిగా పచ్చగా కాకుండా కాస్త పండినదైతే రుచి మరింత మెరుగ్గా ఉంటుంది.
ఈసారి మీ వంటింట్లో ఈ కొత్త పచ్చడిని తప్పక ట్రై చేయండి...












Click it and Unblock the Notifications