భీష్మాష్టమి: అంపశయ్య మీద ప్రాణత్యాగం చేసిన రోజు
రథ సప్తమి తరువాత వచ్చే రోజునే.. భీష్మ అష్టమిగా పిలుస్తారు. ఎందుకంటే భీష్ముడు అంపశయ్య మీద ప్రాణత్యాగం చేసిన రోజు ఇదే కనుక,
ఆ భీష్మ పితామహుని తలుచుకుంటూ మనిషిగా పుట్టిన ప్రతి వారు నీటిని తర్పణగా విడువమని చెప్పింది శాస్త్రం తల్లిదండ్రులు ఉన్నవారైనా సరే తర్పణ విడువడమే కర్తవ్యం.
నలభై ఆరు రోజుల పాటు అంపశయ్య మీద ఉన్న కురువృద్ధుడు ఈ రోజున (భీష్మాష్టమి) తన ఇష్టం ప్రకారం ప్రాణాలను వదిలాడు. సాధారణంగా తండ్రి బతికి ఉన్నవారు తర్పణాలు ఇవ్వడానికి అర్హులు కారు. కానీ భీష్మ తర్పణం విషయంలో ఆ నియమాన్ని పాటించరు. అంతటి ప్రత్యేక స్థానం భీష్ముడికి ఉంది.
అలాంటి మహిమాన్వితమైన రోజున సూర్యోదయమునకు ముందే (ఐదు గంటలకు) లేచి పూజామందిరం, ఇంటిని శుభ్రం చేయాలి. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజామందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి. తలంటు స్నానం చేసి, తెలుపు రంగు దుస్తులను ధరించాలి. ఆ రోజంతా ఉపవాసం వుండి, రాత్రి జాగారం చేయాలి
భీష్మతత్వం
భీష్మ పితామహుడికి సంతానం లేకపొయినా మరణించాక ఈనాటికి పితృతర్పణాలు అందుతూ ఉన్నాయి. అంతటి మహత్తరమైన వ్యక్తిగా భారతకథలో నిలిచిపోయిన మహొన్నతుడు భీష్మపితామహుడు.
ఈయనకు ఇంతమహత్యం సిద్ధించడానికి ఆయన గుణశీలాలే ప్రధానకారణం. మహాతపస్వి అయిన భీష్ముడు పితృభక్తికి, ఇచ్చినమాట నిలబెట్టుకోవడానికి, శౌర్యసంపదకు ఓ గొప్ప ఉదాహరణ. అంతేకాదు ఈయన అపారమైన.. శాస్తవ్రిజ్ఞానాన్ని, ధర్మతత్వాన్ని, పరమాత్మతత్వాన్ని
కూడా చక్కగా అవగతం చేసుకున్నాడు.

భీష్మునిలోని భగవతత్వాన్ని గ్రహించిన కృష్ణుడు ఈయననెంతగానో ప్రశంసించాడు. అంపశయ్య మీద ఉన్నప్పుడు కృష్ణ భగవానుడి ప్రోత్సాహంతోనే సాక్షాత్తూ ధర్మదేవత తనయుడే అయిన ధర్మరాజుకు గొప్ప జ్ఞానాన్ని ప్రబోధించాడు. వర్ణాశ్రమ ధర్మాలు, రాజ ధర్మాలు, ఆపద్ధర్మాలు,
మోక్ష ధర్మాలు, శ్రాద్ధ ధర్మాలు, స్త్రీ ధర్మాలు, దాన ధర్మాలు, ఇలాంటి ఎన్నెన్నో ధర్మాలను గురించి ధర్మరాజుకు ఉన్న ధర్మసందేహాలన్నింటినీ తీర్చి చక్కటి సమాధానాలిచ్చాడు భీష్ముడు.
చక్కటి కథల రూపంలో...
వినగానే ఎవరైనా అర్ధం చేసుకోగల తీరులో అవన్నీ మహా భారతం శాంతి, అనుశాసనిక పర్వాలలో నిక్షిప్తమై ఉన్నాయి. ఆ కథలను ధర్మరాజుకు చెబుతున్న సమయంలో వ్యాసుడు లాంటి గొప్ప గొప్ప ఋషులు కూడా మంత్రముగ్ధులైనట్లు వింటూ ఉండేవారు. కృష్ణతత్వాన్నీ బాగా అవగతం చేసుకున్నవాడు కనుకనే కృష్ణుని గొప్పతనాన్ని గురించి దుర్యోధనుడికి సైతం చెప్పగలిగాడు.
రాజసూయయాగ సమయంలో అగ్రతాంబూలం ఎవరికివ్వాలా అని సందేహం కలిగినప్పుడు అక్కడున్నవారిలో దీనికి అర్హుడు ఒక్క కృష్ణుడే అని నిర్ద్వంద్వంగా అందరికీ తెలియజేశాడు భీష్ముడు.
కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడిని రక్షించేందుకు చక్రాయుధంతో తన మీదకు కృష్ణుడు పరిగెత్తుకొస్తున్నా ఆయనను ఎదిరించక ఆయన చెతిలో మరణించే భాగ్యం కోసం ఎదురుచూశాడు భీష్ముడు.
అన్నిటినీ మించి భీష్మాచార్యుడు ఆనాడు ధర్మరాజుకు ఉపదేశించిన విష్ణు సహస్రనామాలు ఈనాటికీ ప్రజల నాలుకల మీద నానుతూనే ఉన్నాయి.
ఆది శంకరాచార్యులు భగవద్గీత, ఉపనిష త్తులు, బ్రహ్మ సూత్రాలకు భాష్యాన్ని రాసినట్టుగానే ఈ విష్ణు సహస్రనామాలకు కూడా విశేష భాష్యం చెప్పారు. అంతటి మహత్తరమైన భగవత్శక్తి దాగి ఉన్న
విష్ణు సహస్రనామాలను చెప్పడం ఒక్కటి చాలు భీష్ముడి మహత్యాన్ని గురించి తెలుసుకోవటానికి. భీష్మ పితామహుడు ఇలా భక్తి, జ్ఞాన తదితరాలలో గొప్ప కృషి చేసినందువల్లనే ఈనాటికీ అందరికీ ఆయన మార్గ దర్సకుడుగా నిలిస్తున్నాడు.
సంతానం లేకపోయినా...
అన్నిటికంటే మించిన విశేషమేమిటంటే ఆయన వివాహం చేసుకోలేదు.
పిల్లలూ లేరు. కానీ ఇలా అపుత్రకుడి గా మరణించినప్పటికీ సంప్రదాయాన్ని పాటించే వారంతా తమ పితరులకు పితృ తర్పణాలను ఇచ్చేటప్పుడు భీష్మపితామహుడికి కూడా తర్పణాలు అర్పిస్తుంటారు.
అందరికీ అలా ఆయన పితామహుడు (తాతా) లాంటి వాడయ్యాడు.
ఇంతటి గొప్పతనం కేవలం ఆయన ప్రతిజ్ఞా పాలన, పితృ భక్తి, సశ్ఛీల సంపద వలనే లభించాయి. భీష్మాచార్యుడు అందరికీ ఆదర్శ ప్రాయుడిగా, మార్గదర్సకుడిగా నిలు స్తున్నాడు.
భీష్మాష్టమి నాడు తర్పణము చేసినట్లయితే సంవత్సరకాలములో చేసిన పాపములన్నీ నాశనమౌతాయని చెప్పబడినది. తర్పణము ఈ క్రింది మంత్రముతో ఇవ్వవలెను.
వైయాఘ్ర పద్య గోత్రాయ సాంకృత్య ప్రవరాయచ
గంగాపుత్రాయ భీష్మాయ ఆజన్మ బ్రహ్మచారిణే
అపుత్రాయ జలం దద్మి నమో భీష్మాయ వర్మణే
భీష్మశ్శాంత నవో వీర స్సత్యవాదీ జితేంద్రియః
అభిరర్భిరవాప్నోతు పుత్రపౌత్రోచితాం క్రియామ్.
అపసవ్యముగా తర్పణమిచ్చి ఆచమనముచేసి సవ్యముగా అర్ఘ్యమీయవలెను.
వసూనామవతారాయ శంతనోరాత్మజాయచ
అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల్య బ్రహ్మచారిణే
ఈ తర్పణం జీవపితృకులుకూడా చేయవచ్చును. (అయితే అపసవ్యం మాత్రం బ్రహ్మయజ్ఞములో పితృతర్పణము వలె చెయవలెనని తోస్తోంది)
సర్వే జనా సుఖినోభవంతు.












Click it and Unblock the Notifications