పెరగనున్న విద్యుత్ బిల్లులు! ఆ రాష్ట్రంలో జూన్ 1 నుంచి..
ఇప్పటికే ఎండ తీవ్రతతో ఏసీలు, కూలర్లు వాడుతూ భారీగా కరెంట్ బిల్లులు కడుతున్న సామాన్యుడి నెత్తిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మరో పిడుగు వేసింది. వచ్చే జూన్ నెల నుంచివిద్యుత్ బిల్లులను కనీసం 10 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇంధన ధరల పెరుగుదల కారణంగా 'ఫ్యూయల్ సర్ఛార్జ్' భారాన్ని వినియోగదారులపై వేస్తున్నట్లు 'ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్' (UPPCL) శనివారం (మే 30, 2026) ఒక అధికారిక ప్రకటన వెల్లడించింది.
ఈ పెరిగిన ధరలు జూన్ నెలలో వచ్చే బిల్లింగ్ సైకిల్ నుండే నేరుగా వర్తిస్తాయని యూపీపీసీఎల్ స్పష్టం చేసింది. "నిబంధనల ప్రకారం.. ఈ ఏడాది మార్చి (2026) నెలకు సంబంధించి లెక్కించిన 'ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ అడ్జస్ట్మెంట్ సర్ఛార్జ్' (FPPAS) మొత్తాన్ని జూన్ 2026 నెల బిల్లుల్లో వసూలు చేయడం జరుగుతుంది. మార్చి నెలాఖరు నాటికి ఈ అదనపు భారం (FPPAS) 10 శాతంగా తేలింది. దీన్ని అన్ని వర్గాల (గృహ, వాణిజ్య, పారిశ్రామిక) వినియోగదారుల బిల్లులకు అదనంగా చేర్చాలని ఆదేశాలు వచ్చాయి" అని అధికారులు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

మూడు నెలల ఆలస్యంగా భారం బదిలీ.. ఎందుకంటే?
ఉత్తరప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (UPERC) గతేడాది తీసుకొచ్చిన కొత్త నిబంధనల (MYT రెగ్యులేషన్స్, 2025) ప్రకారమే ఈ అదనపు బాదుడు ఉంటోందని రెగ్యులేటరీ అఫైర్స్ యూనిట్ (RAU) చీఫ్ ఇంజనీర్ పంకజ్ సక్సేనా ఒక లేఖలో వివరించారు. ఈ కొత్త రూల్స్ ప్రకారం.. విద్యుత్ ఉత్పత్తి సంస్థలు కొనుగోలు చేసే బొగ్గు, గ్యాస్ వంటి ఇంధన ధరల్లో వచ్చే మార్పులు లేదా అదనపు ప్రసార ఖర్చుల భారాన్ని మూడు నెలల ఆలస్యం తర్వాత నేరుగా కస్టమర్ల అకౌంట్లలోకి బదిలీ చేసే వెసులుబాటు విద్యుత్ పంపిణీ సంస్థలకు (డిస్కమ్లకు) ఉంటుంది. అందువల్లే మార్చి నెలలో కంపెనీలకు అయిన అదనపు ఖర్చును, కరెక్ట్గా మూడు నెలల తర్వాత అంటే జూన్ బిల్లుల్లో 10% సర్ఛార్జ్ రూపంలో వసూలు చేస్తున్నారు.
మధ్యతరగతి బడ్జెట్ అస్తవ్యస్తం:
ఇప్పటికే దేశంలో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఉదాహరణకు దేశ రాజధాని ఢిల్లీలోనే పెట్రోల్ ధర లీటరుకు రూ.100 మార్కును దాటి రూ.102.12కు చేరగా, డీజిల్ ధర రూ.95.20కి పెరిగింది. రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసరాల ధరలు మండిపోతున్న తరుణంలో.. ఇప్పుడు కరెంట్ బిల్లులు కూడా 10 శాతం పెరగడం మధ్యతరగతి గృహాల నెలవారీ బడ్జెట్ను పూర్తిగా అస్తవ్యస్తం చేయనుంది. జూన్ నుంచివచ్చే కరెంట్ బిల్లులను చూసి సామాన్యులు గట్టి షాక్ తినడం ఖాయంగా కనిపిస్తోంది.














Click it and Unblock the Notifications