ఏ దేవుడికి ఎలా దీపారాధన చేయాలి..?ఎదురుగా దీపారాధన ఎందుకు చేయకూడదు..!
దీపారాధన
డా. ఎం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
దీపం జ్యోతి పరబ్రహ్మ
దీపం సర్వతమోపహః
దీపేన సాధ్యతే సర్వం
సంధ్యా దీపం నమోస్తుతే
దీపారాధన చేసేటప్పుడు ప్రమిదను మన శరీరంగా, వత్తిని మన మనసుగా భావించి వెలిగించాలి. అగ్ని సంస్కారం అంటే జ్ఞానము, వెలిగించట అని అర్థము. శరీరమును, మనసును జ్ఞానముతో దేవునికి అర్పించుటే దీపారాధనలోని అంతరార్థం. దీపం ముమ్మూర్తులా పరబ్రహ్మ స్వరూపమే. వెలుగుతున్న వత్తి ప్రకాశాన్ని ఇస్తుంది. పాప ప్రక్షాళన చేస్తుంది. దీపానికి ఉన్న అద్భుతమైన శక్తే అంధకారాన్ని పోగొట్టడం. అంధకారమంటే... కేవలం చీకటి మాత్రమే కాదు. మనసులోని అజ్ఞానం కూడా అంధకారమే! ఆ చీకట్లను పటాపంచలు చేసి, జ్ఞానాన్ని ప్రసాదించే దేవత లక్ష్మీదేవి. ఆ అద్భుత శక్తి కలిగి ఉన్న దీపానికి ప్రతీకే లక్ష్మీదేవి. అందుకే లోకంలో లక్ష్మీస్థానంగా చెప్పే వాటిల్లో దీపం కూడా ఒకటి.
దీపం లక్ష్మీదేవి స్వరూపం ఎలా అయిందన్నదానికీ ఒక కథ ఉంది. పూర్వం ఇంద్రుడు దుర్వాస మహర్షి ఆగ్రహానికి లోనై సకల సంపదలూ కోల్పోతాడు. అప్పుడు దిక్కుతోచక శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తే ఆయన జ్యోతి రూపంలో లక్ష్మీదేవిని పూజించమని సలహా ఇచ్చాడట. ఇంద్రుడు అలా భక్తితో పూజించి తిరిగి తన సంపదలను పొందాడనీ అప్పటినుంచే లక్ష్మీ దేవి దీపలక్ష్మీదేవి అయిందనీ చెబుతారు. తమిళులు కూడా లక్ష్మీపూజ దీప స్తంభానికే నిర్వహిస్తారు.
అమ్మవారి ప్రతిరూపాలు ఉన్న కుందుల్లో మీనాక్షి దీపాలను వెలిగిస్తారు. జ్ఞానసముపార్జనకూ ఊర్ధ్వదృష్టికీ ప్రతీక అయిన దీపానికి మనం నమస్కరిస్తాం, ప్రదక్షిణలు చేస్తాం, పండగలు చేసుకుంటాం. మరో కథనం ప్రకారం... దీపం సకలదేవతలకూ సాక్షీభూతమని చెబుతారు. దీపం వెలిగించే కుంది కింది భాగంలో బ్రహ్మ, మధ్య భాగంలో విష్ణుమూర్తి, ప్రమిదలో శివుడు, వత్తి వెలుగులో సరస్వతి, వెలిగే జ్యోతిలో లక్ష్మీదేవి కొలువై ఉంటారని ప్రతీతి. అందుకే పూజలో భాగంగా దీపాన్నీ పూజిస్తారు. పూలూ అక్షతలూ జల్లుతారు, నైవేద్యం పెడతారు.

ఏ దేవుడికి ఎలా దీపారాధనను సమర్పించాలి:- దేవీదేవతలనుబట్టి దీపారాధనను సమర్పించే విధానమూ మారుతూ ఉంటుంది. శివుడికి ఎడమవైపు, విష్ణువుకి కుడివైపు దీపారాధన చేయాలి. ఏ దేవుడికీ ఎదురుగా దీపారాధన చేయకూడదు. అమ్మవారికైతే తెల్లని బియ్యం రాశిగా పోసి, దానిమీద వెండికుందిని పెట్టి దీపారాధన చేస్తే మేధస్సూ, సాత్విక మార్గంలో సంపాదనా పెరుగుతాయంటారు. గుమ్మానికి ఎదురుగా ఉండే తులసి కోట దగ్గర మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే ఇంట్లోకి దుష్టశక్తులు రావని నమ్ముతారు. శనీశ్వరుడిని పూజించడం మాట అటుంచితే తలచుకోడానికి కూడా చాలా మంది భయపడతారు. అయితే మనలోని జీవశక్తికీ, ఆయుష్షుకూ అధిదేవత శనీశ్వరుడే. అందుకే ఆయనకు అరచేతిలో నల్ల వస్త్రాన్ని తీసుకుని అందులో నల్లనువ్వులు పోసి మూటకట్టి దాన్నే వత్తిగా చేసి దీపారాధన చేయాలి. అలా చేస్తే శనిదోషాలు తొలగిపోతాయంటారు.
* ఒకవత్తి :- సామాన్య శుభం
* రెండు వత్తులు :- కుటుంబ సౌఖ్యం
* మూడువత్తులు :- పుత్ర సుఖం
* ఐదువత్తులు :- ధనం, సౌఖ్యం, ఆరోగ్యం, ఆయుర్ధాయం , అభివృద్ధి.. దీపారాధనకు పత్తితో చేసిన వత్తి శ్రేష్ఠము.
** దీపారాధన ఉపయోగించవలసిన తైలం వాటి ఫలితాలు **
* నెయ్యి :- నేతితో దీపారాధన చేసిన ఇంటిలో సర్వ సుఖాలు సౌభాగ్యాలు కలుగును.
* నువ్వుల నూనె :- నువ్వుల నూనెతో దీపారాధన చేసిన సమస్త దోషములు , పీడలు తొలగును.
* ఆముదం :- ఆముదముతో దీపారాధన చేసిన దేదీప్య మానమగు జీవితం , బంధుమిత్రుల శుభం, దాంపత్య సుఖం వృద్ధి యగును..
* వేరుశెనగనూనె :- వేరుశెనగ నూనెతో దీపారాధన చేసిన నిత్య ఋణములు, దుఖం, చోర భయం, పీడలు మొదలగునవి జరుగును .
* నెయ్యి , ఆముదం , వేప నూనె , కొబ్బరి నూనె , ఇప్ప నూనె కలిపి 48 రోజులు దీపారాధన చేసిన వారికి దేవీ అనుగ్రహం కలుగును .
* వేప నూనె, నెయ్యి , ఇప్ప నూనె మూడు కలిపి దీపారాధన చేసిన ఐశ్వర్యం.., ఇలవేల్పులకు సంతృప్తి కలుగును .
* ప్రతిరోజు దీపారాధన ఉదయం మూడు గంటల నుండి ఆరు గంటలలోపు చేసిన సర్వ శుభములు, శాంతి కలుగును.
** దీపాలయొక్కదిక్కుల ఫలితములు **
* తూర్పు :- కష్టములు తొలగును , గ్రహ దోషములు పోవును..
* పశ్చిమ :- అప్పుల బాధలు , గ్రహ దోషములు , తొలగును. (సిద్ధాంతి లేదా గురువుల యొక్క సూచనల మేరకు చేయాలి అందరూ చేయరాదు.)
* దక్షిణం :- ఈ దిక్కున దీపము వెలిగించరాదు.. కుటుంబమునకు కష్టము కలుగును.
* ఉత్తరం :- ధనాభివృద్ధి, కుటుంబము లో శుభ కార్యములు జరుగును.
** దీపవత్తులయొక్క ఫలితములు **
* పత్తి:- పత్తితో దీపము వెలిగించినదో ఆయుషు పెరుగును .
* అరటినార :-ఆరటి నారతో దీపము వెలిగించినచో చేసిన తప్పులు తొలగి కుటుంబమునకు శాంతి కలుగును .
* జిల్లేడునార:- జిల్లేడినారతో దీపము వెలిగించినచో భూత, ప్రేత, పిశాచాల బాధలు ఉండవు.
* తామరనార :-పూర్వ జన్మలో చేసిన పాపములు తొలగును.. ధనవoతులు అగుదురు .
* నూతనపసుపువస్త్రము :- అమ్మవారి అనుగ్రహమునకు పాత్రులగుదురు..
* నూతనఎరుపువస్త్రము :- వివాహాలు జరుగును , సంతానము కల్గును.
* నూతనతెల్లవస్త్రము :- పన్నీరులో ముంచి ఆరబెట్టి దీపము వెలిగించిన శుభకార్యములు జరుగును.
* సాయంత్ర సమయము లందు శ్రీ మహాలక్ష్మి కి దీపారాధన చేసి పసుపు కుంకుమతో అర్చన చేస్తే కుటుంబ క్షేమం , సౌభాగ్యం కల్గును .
* జాతకంలోని గ్రహస్థితి ఆధారంగా దీపారాధన చేసిన యెడల సత్పలితాలు కలుగును.












Click it and Unblock the Notifications