వినాయకచవితి 2022: విశిష్టత; ముహూర్తం, నవరాత్రుల సంబరాల వెనుక విశేషాలివే!!
భారత దేశ వ్యాప్తంగా గణేశ నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవడానికి ప్రజలు సిద్ధమయ్యారు. కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్లపాటు ఉత్సవాలను నిషేధించడంతో, ఈ సంవత్సరం కరోనా నుంచి కాస్త ఉపశమనం లభించడంతో తొమ్మిది రోజుల పాటు జరిగే పవిత్రమైన గణేశ నవరాత్రి ఉత్సవాలకు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. వినాయక చవితి పండుగను భారతదేశం అంతటా ప్రజలు వైభవంగా జరుపుకుంటారు. అయితే, ఇది ప్రధానంగా మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొదలైన రాష్ట్రాల్లో అత్యంత ఘనంగా జరుపుకుంటారు.
తొమ్మిది రోజులపాటు గణేశ చతుర్థి వేడుకలు
పండుగ మొదటి రోజున ప్రజలు తమ ఇళ్లలో గణపతి విగ్రహాలను ప్రతిష్టించడం ద్వారా గణనాథునికి స్వాగతం పలుకుతారు. వినాయకుడిని పువ్వులతో అలంకరించి పూజిస్తారు. తొమ్మిది రకాలైన పత్రితో కూడా వినాయకుడిని పూజిస్తారు. తొమ్మిది రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో వినాయకుని పూజలు నిర్వహించి ఆపై నిమజ్జనం చేస్తారు. అయితే పూజ కోసం ఇంట్లో గణేశ విగ్రహాలను ఉంచే వ్యవధి పూర్తిగా భక్తులపై ఆధారపడి ఉంటుంది.
ఈ పండుగను జరుపుకోవడం వెనుక అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇక వినాయకుని ప్రతిష్టించవలసిన, నిమజ్జనం చేయవలసిన అనేక అంశాలను గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
వినాయక జననానికి సంబంధించిన ప్రాశస్త్యంలో ఉన్న కథ
భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథి నాడు గణేశుడు జన్మించాడు. ఆయన పుట్టిన రోజునే వినాయక చవితి వేడుకలుగా జరుపుకుంటున్నాము. అయితే ఈ సంవత్సరం వినాయక చవితి ఆగస్టు 31వ తేదీన వచ్చింది. గణేశుడి జన్మ గురించిన ప్రసిద్ధ కథనం విషయానికి వస్తే పార్వతీ దేవి తాను స్నానానికి ఉపయోగించిన నలుగుపిండి ముద్దతో వినాయకుడిని తయారు చేసిందని, దానికి ప్రాణం పోసిందని చెబుతారు.
తను స్నానం చేసి వచ్చే వరకు ద్వారం దగ్గర కాపలా ఉండమని తనయుడిని కోరి పార్వతీదేవి స్నానానికి వెళుతుంది. వినాయకుడు తన కర్తవ్యాన్ని నిర్వహిస్తుండగా శివుడు వచ్చి భార్య వద్దకు వెళ్లడానికి ప్రయత్నిస్తాడు. పార్వతీ దేవిని కలవడానికి గణేశుడు నిరాకరించడంతో, శివుడు కోపోద్రిక్తుడై అతని శరీరం నుండి గణేశుడి తలను వేరు చేశాడు.
అది చూసిన పార్వతీ దేవి తన కుమారుని ప్రాణాలు తనకు తెచ్చి ఇవ్వవలసిందిగా శివుడు చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో శివుడు గున్న ఏనుగు తలను గణేశుడి శరీరానికి అతికించి ప్రాణం పోశాడు. అప్పటి నుండి, ఈ రోజును గణేశ చతుర్థిగా జరుపుకుంటారు.
దేశభక్తికి ప్రతీకగా గణేష్ చతుర్థి పండుగ
చత్రపతి శివాజీ మహారాజ్ కాలం నాటికే ఈ పండుగను ఘనంగా జరుపుకునేవారు. ఏది ఏమైనప్పటికీ, ప్రజలను ఏకం చేయడానికి మరియు వారి మధ్య ఉన్న కులతత్వ అంతరాన్ని తగ్గించడానికి బాలగంగాధర్ తిలక్ ఈ పండుగను ప్రారంభించారని తెలుస్తోంది. జాతీయవాద స్ఫూర్తిని ప్రేరేపించడానికి, పండుగ సమయంలో గణేశ విగ్రహాన్ని ప్రతిష్టించే సంప్రదాయాన్ని ప్రారంభించారని చెబుతారు.
బహిరంగ ప్రదేశంలో పెద్ద మట్టి గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించిన మొదటి వ్యక్తి బాలగంగాధర్ తిలక్ అని ప్రజలు నమ్ముతారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కులమతాలకు అతీతంగా చిన్న పెద్ద తేడా లేకుండా, పేద ధనిక అన్న వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరూ వినాయక చవితి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు.
గణేష్ చతుర్థి జరుపుకోవాల్సిన ముహూర్తం ఇదే
ఈసారి ఆగస్ట్ 31న గణేష్ చతుర్థి రోజున ఈ పండుగ ప్రారంభమవుతుంది. అయితే, గణేష్ చతుర్థి తిథి ఆగస్టు 30 మరియు 31 మధ్య వస్తుంది. తిథి సమయం ఆగష్టు 30 మధ్యాహ్నం 3:33 గంటలకు ప్రారంభమవుతుంది మరియు మరుసటి రోజు మధ్యాహ్నం 3:22 వరకు ఉంటుంది. సెప్టెంబరు 9న వచ్చే అనంత చతుర్దశి పండుగ ముగియడంతో భక్తులు గణేశ విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేస్తారు. ఇక అత్యంత ఘనంగా సంబరాలతో వినాయక నిమజ్జనోత్సవాన్ని నిర్వహిస్తారు.
గణేష్ చతుర్థి నాడు చంద్రుని చూడకుండా ఉండాలి
పురాతన విశ్వాసాల ప్రకారం, గణేశ చతుర్థి నాడు రాత్రి చంద్రుని దర్శనానికి దూరంగా ఉండాలి. ఈ సందర్భంగా చంద్రుడిని చూడడం వల్ల నీలాప నిందలు పడవలసి వస్తుందని, దోషాలు కలుగుతాయని ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఒకవేళ చంద్రుణ్ణి చూసిన దోషాలు తొలగిపోవాలంటే వినాయక చవితి కథను చదివి, ఆ అక్షతలను తలపై దాలిస్తే నీలాపనింద నుండి బయటపడతారని చెబుతారు.