గురు పౌర్ణమి: అజ్ఞానమనే చీకటిని తొలిగించే శక్తే గురువు
డా. ఎం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
అజ్ఞాన
తిమిరాంధస్య
జ్ఞానాంజన
శలాకయా
చక్షురున్మీలితం
యేన
తస్మై
శ్రీగురవేనమః
గురుబ్రహ్మ
గురుర్విష్ణు
గురుర్దేవో
మహేశ్వరః
గురుస్సాక్షాత్పరబ్రహ్మ
తస్త్మై
శ్రీ
గురువే
నమః'
మన తల్లి తండ్రులకును మించిన గురువు లెవరు. తస్మై శ్రీ గురవేనమః... నేడు గురుపౌర్ణమి తస్మై శ్రీ గురవేనమః నేడు గురు పౌర్ణమి హలం పట్టుకున్నా.. కలం పట్టుకున్నా.. నేర్పేవాడు ఉన్నప్పుడే అందులో మెళుకువలు తెలుస్తాయి. ఆ నేర్పించేవాడే గురవు. లౌకిక, అలౌకిక, ఆధ్యాత్మిక.. ఇలా ఏ రంగంలో అయినా మనలను నడిపించడానికి గురువు కావాల్సిందే. సనాతన హైందవ సమాజంలో గురువుకు తల్లిదండ్రుల తర్వాత స్థానం దక్కింది. 'గురోః ప్రసాదాత్ అన్యత్ర నాస్తి సుఖం మహీతలే' అని గురువు అనుగ్రహం లేనిదే ఇహలోకంలోనైనా పరలోకంలోనైనా సుఖం పొందడం దుర్లభం అని శాస్త్రం బోధిస్తోంది. గుకారశ్చాంధకారస్తు రుకార్తన్నిరోధకృత్ 'గు'అంటే చీకటి 'రు' అంటే దానిని అడ్డగించువాడు.
అజ్ఞానమనే చీకటిని తొలిగించే శక్తే గురువు. నాలుగు వేదాలు, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు, బ్రహ్మ సూత్రాలు, మహాభారతం, భాగవతం..మానవాళికి అందించిన మహోన్నతుడు జ్ఞాన బ్రహ్మ వ్యాస మహాముని జన్మదినమే గురు పూర్ణిమ. సనాతన వైదిక ధర్మానికి ఇది ఒక మహాపర్వదినం. ప్రకృతి ధర్మానుసారం జరిగే చాతుర్మాస దీక్షలో యతులు, పీఠాధిపతులు ఎక్కడకీ వెళ్లకుండా ఒకేచోట ఉండి జ్ఞానబోధన చేస్తుంటారు. ఈ దీక్ష సమయంలో వచ్చే మొదటి పౌర్ణమి గురు పౌర్ణమి. ఈ రోజు తమకు సమీపంగా నివసిస్తున్న తప:స్సంపన్నులను దర్శించుకొని పూజించి జ్ఞానాన్ని సాధించే ఆచారానికి గురుపౌర్ణమి భూమికగా నిలుస్తుంది. దీని వెనుక ఒక విశిష్టత దాగి ఉంది.
మనకు గురువులు అనేవారు చాలా మంది ఉన్నారు. ఈ రోజు వారిని దర్శించుకోండి. ఈ చరాచర సృష్టికి మూలమైన ఆదిగురువు ఆదియోగి పరమేశ్వరుని దర్శించుకోండి. ఈ జగత్తుకు గురువైన శ్రీ కృష్ణ పరమాత్మ ను దర్శించుకోండి. శ్రీమద్ విరట్ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు, జగద్గు రువు ఆది శంకరాచార్యుల వారు, శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారు, గురు రాఘవేంద్ర స్వాముల వారిని కానీ మనకు చదువు చెప్పిన గురువులను కలిసి వారి ఆశీస్సులు తీసుకోండి. సద్గురువు తారసపడిన నాడు అవివేకి కూడా వివేకవంతుడు అవుతాడు. గురు అనుగ్రహం కలిగిన నాడు అజ్ఞాని కూడా జ్ఞానవంతుడు అవుతాడు.
* విద్యార్థి నేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉన్నప్పుడే ఉపాధ్యాయుడు ప్రత్యక్షమవుతాడు. మనలో నేర్చుకోవాలనే కుతూహలం కలిగితే చాలు.. తనకు వచ్చిన విజ్ఞానాన్నంతా నేర్పడానికి గురువు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఈ ప్రయత్నంలో విద్యార్థుల మస్తిష్కంలో పుట్టే ఎన్నో అనుమానాలను తనవిగా భావించి ఏ ఫలమూ ఆశించకుండా వాటిని నివృత్తి చేస్తాడు.
* స్వపరభేదం లేనివాడు, ఏ భ్రాంతికి లోను కానివాడు, అహంకారాన్ని ఆమడ దూరంలో ఉంచేవాడు, ఏ పరిస్థితుల్లో మనోస్థ్యైర్యం కోల్పోక ఆత్మనిష్ఠతో ఉండేవాడే సద్గురువు. అలాంటి గురువుల బోధన విద్యార్థుల ఉన్నతికి దోహదం చేస్తుంది.
* గురువంటే సచ్చిదానంద స్వరూపం. తాను పారదర్శకంగా ఉంటూ.. తనలోని విజ్ఞానాన్ని శిష్యుల్లోకి పరిపూర్ణంగా ప్రసరింపజేసేవాడే నిజమైన గురువు. నీరు పల్లమెరిగినట్టుగా.. గురువులోని విజ్ఞానం శిష్యుడికి చేరాలి. ఇందులో ఎలాంటి సంశయాలకు తావుండకూడదు.
* నాకు అందరికంటే ఆత్మీయుడు గురువే. ఆ తర్వాతే అమ్మానాన్న. తండ్రి 'ఇది చెయ్' అని చెబుతాడు. అదే గురవైతే ఏం చేయకూడదో చెబుతాడు. తల్లిదండ్రులు జన్మనిస్తే.. గురువు పునర్జన్మనిస్తాడు. అందుకే గురువుకే తొలివందనం అర్పిస్తాను.
* జ్ఞానం పొందాలనే విద్యార్థి కుతూహలానికి గురువు వారధిగా మారుతాడు. తమ విద్యార్థుల్లో జ్ఞానవంతులను చేసే క్రమంలో ఉపాధ్యాయులు తమ శక్తినంతా ధారపోస్తారు. ఈ ప్రయత్నంలో కొత్త విషయాలు నేర్చుకునేవారు ఉత్తమ ఉపాధ్యాయులుగా నిలిచిపోతారు.
* తరగతి గదిలోనే దేశప్రగతి దాగి ఉంటుంది, అది గురవు ద్వారా వ్యక్తం అవుతుంది. పిల్లలను బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో ఉపాధ్యాయుడిదే కీలక పాత్ర. ఇంతటి మహత్కార్యాన్ని విజయవంతంగా నిర్వర్తించే గురవు కలకాలం తలెత్తుకుని జీవించవచ్చు. ఇలాంటి గొప్ప అవకాశం మరెవరికీ దక్కదు.
* సద్గురువు సాంగత్యంతోనే నిన్ను నీవు తెలుసుకోగలవు. ఎందుకంటే.. నిన్ను శిష్యుడిగా స్వీకరించిన క్షణంలోనే నీ గురించి ఆయనకు అవగతం అవుతుంది. నీలో మంచిని, చెడునూ గుర్తించగలడు. ఆ చెడును పారద్రోలి.. నిన్ను మంచివ్యక్తిగా మార్చగలిగేది గురువే.
* ఒక వ్యక్తి జీవనయానం దిక్కుతోచని పరిస్థితుల్లో సాగుతోందంటే.. అతడికి సద్గురువు సాక్ష్యాత్కారం లభించలేదని అర్థం చేసుకోవచ్చు. మంచి ఉపాధ్యాయుడి అనుగ్రహం పొందిన వాడు గమ్యం దిశగా సాగిపోతుంటాడు. లక్ష్యాన్ని అందుకుని తీరుతాడు. ఇంతటి మహత్యం గురువులో దాగి ఉంటుంది కాబట్టి మనం మన పిల్లలకు తెలియజేస్తూ.. రేపటి తరానికి విలువలతో కూడిన మన సనాతనధర్మ విశిష్టతను అందజేయండి.