చంద్ర గ్రహణం నాడే పెద్ద పండగ వచ్చింది.. జాగ్రత్తలు పాటించాల్సిందే
రంగుల పండుగ.. హోలీ. ఫాల్గుణ మాసంలో పౌర్ణమి నాడు ఈ పండగను జరుపుకోవడం ఆనవాయితీ. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల సంప్రదాయాల ప్రకారం- వేర్వేరు తేదీల్లో హోలీని జరుపుకొంటుంటారు. ఈ పండగలో అతి ప్రధానమైన కామదహన కార్యక్రమం ఏ రోజున నిర్వహిస్తారనే విషయంపై కొంత భిన్నవాదనలు నెలకొన్నాయి. మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాలు రెండు రోజుల పాటు హోలిని జరుపుకొంటాయి. తొలి రోజు హోలికా దహన్, రెండో రోజు ధూళివందన్ అని పిలుస్తారు.
పంచాంగం ప్రకారం ఈ ఏడాది హోలీ మార్చి 4వ తేదీన బుధవారం నాడు జరుపుకుంటారు. 3న కాముడి దహన కార్యక్రమం ఉంటుంది. ఆ మరుసటి రోజు అంటే 4న ప్రజలు రంగులు, గులాల్ చల్లుకుంటూ పండగను జరుపుకొంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా హోలికా/కాముడి దహనాన్ని నిర్వహిస్తారు. తిథి ప్రకారం- ఫాల్గుణ పౌర్ణమి తిథి మార్చి 2వ తేదీన సాయంత్రం 5:55 నిమిషాలకు ప్రారంభమై మార్చి 3 సాయంత్రం 5:07 నిమిషాలకు ముగుస్తుంది. దీని ఆధారంగా, హోలికా దహనం 3న జరుగుతుంది.

హోలికా దహనానికి శుభ ముహూర్తం సాయంత్రం 6:22 నుండి రాత్రి 8:50 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో దహనం వల్ల ప్రతికూలత తొలగిపోయి, జీవితంలో సానుకూల శక్తి ప్రవహిస్తుందని నమ్మకం. హోలీ రోజున పూజలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ దినాన రాధాకృష్ణ, పరమేశ్వరుడు, లక్ష్మీదేవిని శాస్త్రోక్తంగా పూజిస్తారు. పూజలో గులాల్, రంగులు, పువ్వులు, మిఠాయిలు సమర్పిస్తారు. ఇది సుఖసంతోషాలు, ఐశ్వర్యం, సానుకూలత తెస్తుందని నమ్మకం.
హోలీ రోజున పాలు, పెరుగు, చక్కెర, బట్టలు, ఆవాల నూనె, ఇనుము, ఉక్కు, గాజు వస్తువుల దానం చేయకూడదు. పూజలు, భజనలు, మత ఆచారాలను నియమబద్ధంగా చేయాలి. పూజలో పువ్వులు, రంగులు, మిఠాయిలు ఉపయోగించాలి. రంగులు బలవంతంగా పూయరాదు, మనోభావాలు దెబ్బతీయకూడదు. ప్రతికూలత, ద్వేషం, పాత మనస్పర్థలు తొలగించుకుని, ప్రేమ, సామరస్యం, సోదరభావం స్వీకరించాలి. కలిసికట్టుగా, సురక్షితంగా, గౌరవప్రదంగా పండుగను జరుపుకోవడమే హోలీ నిజమైన అర్థం.
కాగా- హోలీ పౌర్ణమి నాడే చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. మధ్యాహ్నం 3:20 నిమిషాలకు చంద్రగ్రహణం ప్రారంభమై 6:47 గంటలకు ముగుస్తుంది. సాధారణంగా గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. దీని ప్రకారం ఉదయం 9 నుండి సాయంత్రం 7.30 గంటల వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం మూతపడనుంది. సుమారు 10.30 గంటల పాటు మూసివేయనున్నారు. సాయంత్రం 7:30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. అనంతరం శ్రీవారి దర్శనం భక్తులకు 8:30గం నుండి పునః ప్రారంభవుతుంది.












Click it and Unblock the Notifications