కార్తీక దీపం డిప్రెషన్‌ను దూరం చేస్తుందా?

డా.యం.ఎన్.చార్య - -హైదరాబాద్ - ఫోన్: 9440611151

పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్రం వచ్చే మాసమే కార్తీక మాసం. కార్తీకమాసం అనగానే వనభోజనాలు, ఉపవాసాలు, నదీస్నానం వంటి ఆచారాలతో పాటుగా దీపారాధన కూడా గుర్తుకు రాక మానదు. ధార్మికులైనవారు ఏడాది పొడవునా దీపం వెలిగించినా వెలిగించకపోయినా, కార్తీకమాసంలో మాత్రం తప్పకుండా దీపం వెలిగించాలని సూచిస్తుంటారు పెద్దలు.

కార్తీకముతో సమానమైన మాసము లేదు.విష్ణు దేవునితో సమానమయిన దేవుడు లేడు. గంగతో సమానమగు తీర్థము లేదు అని చెప్పబడినది. తెల్లవారు జామునే నిద్రలేవడం, ప్రవహిస్తూ ఉన్నటువంటి నీళ్లలో స్నానం చేయడం, బోళాశంకరునికి నిత్యమూ రుద్రాభిషేకం చేయడం,నుదుట విభూతిని మెడలో రుద్రాక్షల్నీ లేదా తులసి పూసల్ని ధరించండం రోజుకి ఒక పూట మాత్రమే భుజించడం,ఉసిరిక చెట్టు నీడలో వనభోజనాలు చేయడం ఇలా ఒకటేమిటి? ఇలా ఎన్నెన్నో సంప్రదాయాలని మూట గట్టుకుని తెచ్చింది పవిత్రమైన కార్తీకమాసం.

ఈ కార్తీక మాసంలో చేసే వ్రతములలో ముఖ్యమైనవి కార్తీకస్నానం, ఉపవాసము, కార్తీక దీపము.

కార్తీకస్నానం :- కార్తీక మాసమంతా తెల్లవారు జామున లేచి కృత్తికా నక్షత్రం అస్తమించేలోగానే నదులలో గాని చెరువులలో గాని,బోర్ బావిలో నీళ్ళతో గాని చేయాలి.వాస్తవానికి సహజంగా భూమిలో ఉన్న నీటితో చేస్తే ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఇంటి పై కప్పులో స్టోర్ చేసిన నీళ్ళకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వ బడినది.ప్రవకమైన నీళ్ళు అందుబాటులో లేనప్పుడు ఇంట్లోని స్నానాల గదిలో అయినా సరే తలస్నానం చేయాలి.అప్పుడే అది కార్తీక స్నానం అవుతుంది.

Holy Karthika Deepam keeps away depression

ఈ విధంగా నియమంతో స్నానం చేసి శివుడినిగాని, విష్ణవును గాని, లేదా మరే దైవాన్నైనా సరే ధ్యానించడం వలన అర్ఘ్యాదులు ఇవ్వడం వలన కురుక్షేత్రం, గంగానది, పుష్కర తీర్థాలలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. సర్వపాపాలు నశించి పుణ్యఫలితాలు అందుతాయి.

కార్తీక మాసంలో పగలంతా ఉపవాసం చేసి రాత్రి భోజనం చేయాలనేది ఒక నియమం. దీనినే 'నక్తమ్' అంటారు. పగలంతా నిరాహారంగా ఉండలేని వారు పాలవంటి ద్రవ పదార్థాన్ని గాని పండువంటి ఘన పదార్థాన్ని గాని స్వీకరిస్తూ రాత్రివేళ చంద్ర దర్శనం చేసుకుని దీపారాధన చేసుకుని భోజనం చేయాలి.

దీపారాధన మహత్యము:-

కార్తీక పురాణం ప్రకారం ఈ మాసంలో పిప్పలుడు అనే మహారాజు దీపదానం చేయడం వలన సంతానాన్ని పొందాడనీ వారి కుమారుడైన శత్రుజిత్తు ఈ మాసంలో దీపాన్ని వెలిగించడం వల్లా కైలాసాన్ని చేరుకున్నాడనీ కథలు కనిపిస్తాయి. ఇక ఈ మాసంలో ఆవునేతితో దీపారాధన చేస్తే మంచిదంటుంది కార్తీక పురాణం. ఒకవేళ ఆవునేయిని ఉపయోగించే శక్తి లేకపోతే నువ్వుల నూనెతో కానీ, ఇప్ప నూనెతోగానీ,ఏదీ కుదరకపోతే ఆముదంతో కానీ దీపారాధన చేయవచ్చునని చెబుతోంది.

కారణాలు :- కార్తీకమాసంలో మొదలయ్యే చలి కాలంతో పగటి వేళలు తగ్గి చీకట్లు త్వరగా కమ్ము కుంటాయి. ఉష్ణోగ్రతల్లోనూ సూర్య కాంతిలోనూ ఒక్కసారిగా వచ్చే ఈ మార్పుల వల్ల శరీరంలోని "ధాతువులు" జీవగడియారం అస్తవ్యస్తం అయిపోతుంది. ఆహారం దగ్గర నుంచీ నిద్ర వరకూ అన్ని అలవాట్లనూ ఇది ప్రభావితం చేస్తుంది. దీని వలన మనిషి మనసు కూడా స్తబ్దుగా మారిపోతుంది.మరి కొందరైతే ఈ చలికాలంలో ఒక తరహా డిప్రెషన్‌కు లోనవుతారు.ఇలా చలికాలంలో మనసు చిరాకుగా ఉన్నప్పుడు వెలుతురుని చూడటం వల్ల కొంత ఉపశమనం లభిస్తుందని ఆధునిక శాస్త్రం చెబుతోంది. దీనినే వారు Dawn simulation, Light therapy వంటి పేర్లతో పిలుచుకుంటున్నారు.మన కార్తీక దీపాలు చేసే పని ఇదే కదా!

ఆవునేయ్యి, నువ్వుల నూనె, ఆముదం... ఈ మూడింటికీ కూడా మన ప్రాచీన వైద్యంలో తగిన స్థానం ఉంది.వీటితో వెలిగించిన దీపాన్ని చూడటం వలన దృష్టి మెరుగు పడుతుందని చెబుతారు.నవంబరు మాసంలో ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతల వల్ల జలుబు, దగ్గు వంటి కఫ సంబంధమైన సమస్యలు వస్తాయి.ఇక ఆస్తమా, సైనస్‌ వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారికి ఇది కష్ట కాలంగా మారిపోతుంది.ఆవునెయ్యి,నువ్వుల నూనె నుంచి వెలువడే ధూపానికి శ్వాసకోశ సంబంధ వ్యాధులను నివారించే శక్తి ఉందని ఆయుర్వేదశాస్త్రం చెబుతోంది.

నువ్వుల నూనె, ఆముదం, ఆవునెయ్యి... ఈ మూడు ద్రవాలూ కూడా సాంద్రతని ఎక్కువగా కలిగి ఉంటాయి. వీటిని వెలిగించిన దీపాలు ఎక్కువసేపు వెలుగులు చిమ్ముతాయి.పైగా అధికమైన వేడినీ ఇస్తాయి.అలా ఇవి మన ప్రాంగణాలలో చలిని కొంతవరకన్నా తగ్గిస్తాయి.చలికాలంలో క్రిమికీటకాలు ప్రబలుతాయి.వీటికి తోడు ఏపుగా పెరుగుతున్న పొలాలను ఆశించి బతికే సన్నదోమల వంటి కీటకాలు కూడా జనావాసాలలోకి ప్రవేశిస్తుంటాయి. వీటిని మన ఇళ్లకి దూరంగా ఉంచే సత్తువ నూనె దీపాలకు ఉంది.

దీపాలను ఎక్కడెక్కడ వెలిగిస్తారు :-కార్తీక మాసమంతటా సాయంత్రం వేళల్లో శివాలయాలలో కానీ, విష్ణుమూర్తి ఆలయాలలోగానీ దీపాన్నివెలిగిస్తే మంచిది.ఆలయ ద్వారం వద్ద కానీ గోపురం వద్దకానీ దేవుని సన్నిధి వద్దకానీ ఇలా దీపాలను వెలిగిస్తూ ఉంటారు.గుడిలో దీపాలను వెలిగించడం కుదరని పక్షాన ఇంట్లోనే గుమ్మాల వద్ద, పూజా మందిరంలో కానీ తులసి కోట వద్దకానీ దీపారాధన చేసుకోవచ్చు.ఇక ఉసిరి, రావి వంటి దేవతా వృక్షాల కింద నదీతీరాలలో దీపారాధన చేసినా కూడా విశేష ఫలితం లభిస్తుందన్నది పెద్దల మాట.

ఒక్కరోజునన్నా:- కార్తీక మాసమంతా ఉదయం, సాయంత్రం సంధ్యవేళల్లో దీపారాధన చేయమని సూచిస్తుంటారు. ఒకవేళ మాసమంతా కుదురకపోతే కార్తీక సోమవారాలు,శుద్ధ ఏకాదశి, ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి వంటి తిధులలో కృత్తిక ,మఖ నక్షత్ర రోజులలో అయినా దీపాలను వెలిగించమంటారు.ఇదీ కుదరకపోతే కనీసం పౌర్ణమి రోజునైనా దీపం వెలిగించి తీరమని చెబుతారు.ఈ కార్తీక పౌర్ణమి సందర్భంలో 365 దీపాలను వెలిగించినవారికి ఏడాది పొడవునా దీపాలు వెలిగించినంత పుణ్యం లభిస్తుందన్నది విజ్ఞుల మాట.దీపం వెలిగించే అవకాశం ఏమాత్రం లేనివారి కోసమే ఇలాంటి సౌలభ్యాలు ఏర్పరిచి ఉంటారు కానీ వీలైనంతవరకూ మాసం పొడవునా దీపాన్ని వెలిగించడమే మంచిది మానసిక తృప్తి లభిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+