కార్తీకమాసంలో ఇలా చేస్తే ఆకస్మిక ధననష్టం
Karthika Masam 2024: హైందవంలో అత్యంత ప్రాధాన్యత గల కార్తీక మాసం ఆరంభమైంది. ప్రతి సంవత్సరం దీపావళి అమావాస్య ముగిసిన మరుసటి రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభం అవుతుంది. ఈ మాసాన్ని శివ, కేశవులకు అత్యంత ప్రీతికరమైనది, అత్యంత మహిమాన్వితమైనది చెబుతారు పెద్దలు.
తెలుగు క్యాలెండర్ ప్రకారం చూస్తే- ఇది ఎనిమిదో నెల. చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసిన రోజు కావడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి కార్తీక మాసానికి. నదీ/సముద్ర స్నానాలు, వనభోజనాలు నెలపొడవునా కనిపిస్తుంటాయి. నోములు, వ్రతాలకు అత్యంత శుభప్రదమైనదిగా భావిస్తారు.

ఏకాదశి, సోమ, శనివారాల్లో ఉపవాసాన్ని పాటించడం ఆనవాయితీగా వస్తోంది. తెల్లవారు జామున, సాయంత్ర వేళల్లో ఆలయాల్లో దీపాలను వెలిగిస్తుంటారు భక్తులు. తులసికి ప్రత్యేక పూజలు చేస్తారు. గోవులను పూజిస్తారు. ఈ మాసంలో పరమశివుడికి ఆవు పాలతో అభిషేకించి, జాజిపూలతో పూజించితే శివస్థానాన్ని పొందుతారని ప్రశస్తి.
పవిత్ర కార్తీక మాసంలో నదుల్లో పుణ్యస్నానాలను ఆచరించడం, దైవదర్శనం చేసుకోవడం వల్ల రెట్టింపు ఫలితం కలుగుతుందని భక్తుల నమ్మకం. రోజుకొకటి చొప్పున కార్తీక పురాణంలో ఉండే 30 అధ్యాయాలను పారాయణం చేయడం శుభప్రదంగా భావిస్తారు. శైవక్షేత్రాల్లో కార్తీక పురాణాన్ని పారాయనం చేస్తారు.
అదే ఆహార నియమాలను పాటించాల్సి ఉంటుందని, మాంసాహారం జోలికి వెళ్లకూడదని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. ప్రతి ఆదివారం, సప్తమి రోజున ఆహారంలో ఉసిరిని వినియోగించకూడదని, అలాగే అష్టమినాడు కొబ్బరి వాడకూడదని దీనివల్ల ఆకస్మిక ధననష్టం సంభవిస్తుందని విశ్వసిస్తారు.
ఈ నెల పొడవునా భక్తులు ఆలయాలను సందర్శిస్తుంటారు. అయ్యప్ప స్వామి భక్తులు మాలధారణ చేసేదీ ఈ మాసంలోనే. శ్రీశైలం, శ్రీకాళహస్తి వంటి శైవక్షేత్రాలన్నీ కార్తీక శోభను సంతరించుకుంటాయి. భక్తులతో పోటెత్తుతుంటాయి. వారణాశి, ఉజ్జయినీ, ఇతర జ్యోతిర్లింగాలను దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్తుంటారు.












Click it and Unblock the Notifications