అంతర్యామి సంధ్యోపాసన
ఆర్ష సంప్రదాయంలో కాలం పూజనీయం. కాలాన్ని దైవంగా భావిస్తాం. కాలభైరవుడు, కాళరాత్రి, మహాకాలుడు అని అనేక పేర్లతో పిలుస్తాం. కాలం - చీకటి, వెలుగు, సంధ్య అనే మూడు రూపాల్లో ఉంటుంది. చీకటిని అజ్ఞానానికి, వెలుగును జ్ఞానానికి ప్రతిరూపంగా భావిస్తాం. మంచి-చెడు, కర్మ-అకర్మ, సంకల్ప-వికల్పాలు, ధర్మ-అధర్మాలు... ఇలా ప్రకృతిలోని అన్ని ద్వంద్వ భావాలను ఈ చీకటి-వెలుగులతో పోలుస్తాం. వీటిమధ్య ఉన్న సంధికాలం పేరు సంధ్య. ఇది చీకటి కాదు, వెలుగు కాదు. పగలు కాదు, రాత్రి కాదు. అన్ని ద్వంద్వ భావాలకు అతీతమైన పరమాత్మ పూర్ణస్థితికి చిహ్నంగా సంధ్యాకాలాన్ని భావిస్తాం.
సంధ్యాసమయం దివ్యమైన ఉపాసనాకాలం గా చెబుతారు. ప్రత్యేకించి గాయత్రీ అనుష్ఠానానికి అనుసరించే కాలం. దీన్నే సంధ్యోపాసన అంటారు.దేవీ భాగవతంలో 12వ స్కంధంలోను, ఐతరేయ బ్రాహ్మణంలోను, ఉపనిషత్తుల్లోను సంధ్యోపాసన విశిష్టత వివరంగా ఉంది.
బుద్ధి వికసిస్తేనే మనసు దైవం వైపు మరలుతుంది. అప్పుడే మనిషి అజ్ఞానమనే చీకటి నుంచి వెలుగువైపు అడుగులు వేస్తాడు. మనిషి జీవితంలో వెలుగును నింపేవాడు పరమాత్మ. అందుకే పరమాత్మను జ్యోతి స్వరూపంగా భావిస్తాం. 'తమసోమా జ్యోతిర్గమయ' అనే ఉపనిషత్తు వాక్యార్థం కూడా ఇదే. మనిషి తనకు నచ్చిన సాకార రూపాన్ని పరమాత్మకు కల్పించి, అర్చించాలి.మనిషి చేసే జపతపాదులతో కర్మపాకం నశించి, భక్తి పరాకాష్ఠకు చేరుతుంది.దీనితో పరమాత్మ సాకార అర్చనా రూపం దర్శనమవుతుంది.అప్పుడు 'దేవుడు ఉన్నాడు' అనే నిశ్చయ భావన కలుగుతుంది. ఆ తరవాత జ్యోతిరూపంగా భావించి, ధ్యానించాలి.
పరమాత్మను జ్యోతిస్వరూపంగా వర్ణించింది మన వాఙ్మయం. 'అంధకారానికి అతీతమైన సూర్యదీప్తితో ప్రకాశిస్తాడు పరమాత్మ' అంటుంది శ్వేతాశ్వతర ఉపనిషత్తు. ధ్యానంలో మనసు స్థిరపడితే పరమాత్మ తేజోమయ రూపదర్శన భాగ్యం కలుగుతుంది.మనసంతా ఆ తేజోమయ రూపంతో నిండిపోతుంది. ఇదే శాశ్వతమని, సత్యమని, తురీయమనే భావన, భ్రమ కలుగుతాయి. పరమాత్మను అన్వేషించే క్రమం ఈ జ్యోతిర్మయ దర్శనంతో ఆగిపోదు. ఇది సాధనలో సాధకుడు పొందే మొదటి అద్భుత అనుభూతి మాత్రమే. అసలైన ఆధ్యాత్మిక ప్రయాణం ఇక్కడే మొదలవుతుంది.
పరమసత్యం తేజోమయమైన తెరతో కప్పి ఉంది అంటుంది శాస్త్రం. తెరవెనక ఉన్న సత్యాన్ని గ్రహించాలి అంటే ముందుగా ఆ తెరను దర్శించాలి.తేజస్సు అనే తెరను దర్శించాక,ఆవల ఉన్న సత్యాన్నిఅన్వేషించే సాధన కొనసాగాలి.
ఈశావాస్యోపనిషత్తు బోధించిన ఈశవిద్యలో దీని వివరణ ఉంది. దీన్నే బ్రహ్మాది దేవతలు ధ్యానించే మహాశూన్యమని, ఆత్మతత్వమని, అద్వైత స్థితి అని యోగులు చెబుతారు. సంధ్యోపాసనే దీనికి ఉత్తమ మార్గం.తోతాపురి అనే మహర్షి ఇచ్చిన సందేశం రామకృష్ణుల వారి సాధనా మార్గాన్నే మార్చింది.
'ప్రకాశవంతమైన దేవీరూపం కూడా సత్యదూరమని, సత్యం వెలుగుకు ఆవల ఉండేదని, ఈ ద్వంద్వాలన్నింటినీ అతిక్రమించిన మనోస్థితిలో ఆ యథార్థ వస్తువు అనుభవాన్ని పొందా'లని ఆ మహర్షి చేసిన ఉపదేశం నిర్గుణోపాసనకు దారి చూపింది.అందరిలోనూ అన్నింటిలోనూ పరమాత్మను చూసే భాగ్యం వారికి కలిగింది. పరమహంసగా వారి జీవితం చరితార్థం అయింది. వారి దివ్యబోధనలు సత్యాన్వేషణకు మార్గసూత్రాలు. భక్తుల సందేహాలకు అవి సమాధానాలు!