Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అహం బ్రహ్మాస్మి : మనిషిలోని అహం ఎలా పోతుంది?

సహజంగా జీవించడానికి, సమాజంతో కలిసి నడవడానికి అడ్డుపడే ఆటంకాలను గుర్తించి, వాటినుండి బయటపడే మార్గాన్ని,నా మార్గంగా సూచించడమే ఈ రచన ఉద్దేశ్యం.ఇందులో ప్రస్తావించిన ఈశ్వరుడు, బ్రహ్మం మతానికి చెందినవారు కారు.మానవత్వానికి చెందినవారు. గణితసమీకరణం అర్ధం కాకపోయినా సమస్యా,దాని పరిష్కారం అర్ధం అవుతాయి.

ఈశ్వరుడు:చూసేవాడు జీవుడు,ద్రష్ట.జీవుడి చేత చూడబడేది జగత్తు, దృశ్యం. ఈ క్రింది అద్వైత సమీకరణం ప్రకారం జీవుడూ జగత్తు (ద్రష్ట,దృశ్యం) రెండూ ఈశ్వరుడే. రెండూ ఆయనవే. రెండింటి అంతరాత్మ ఈశ్వరుడే. కాబట్టి జీవజగత్తులు రెండూ నిమిత్తమాత్రంగా ఉంటూ అంతరాత్మ ప్రబోధాన్ని అనుసరించి నడుచుకోవాల్సి ఉంది.

What is Aham Brahmasmi?

జంతువులు తమకు తెలియకుండానే అంతరాత్మ ప్రభోదాన్ని అనుసరిస్తాయి.
అందుకే శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు.శివుడాజ్ఞను పాటించడానికే కుట్టిన చీమకు కుట్టిన పాపం అంటదు. జంతువులు నిమిత్తమాత్రంగా జీవిస్తాయి.కానీ అర్జునుడు నేను నిమిత్తమాత్రుణ్ణని అనుకోలేదు. యుద్ధంలో శత్రువులను చంపుతున్నది 'నేను' అనుకుని ఆ కార్యానికి కర్తృత్వం వహించాడు.

దాంతో తన వాళ్ళను చంపిన పాపం తనను చుట్టుకుంటుందన్న భయం,బాధ అతణ్ణి యుద్ధానికి విముఖుణ్ణి చేసాయి.అంతరాత్మ ప్రభోధం( శ్రీకృష్ణుడే అంతరాత్మ,అయన ప్రబోధమే భగవద్గీత) విన్న తరువాత తాను నిమిత్తమాత్రుణ్ణని గుర్తించి,కర్తృత్వాన్ని(అహంకార మమకారాలను) విడిచిపెట్టి యుద్ధం చేస్తాడు.

ఎవరిమాటైనా వినాలంటే వారి మీద విశ్వాసం ఉండాలి. అంతరాత్మ ప్రబోధం వినాలంటే దాని మీద విశ్వాసం ఉండాలి. ఇదే ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం లేని జీవుడు అంతరాత్మ గొంతు నొక్కేస్తాడు.ఆత్మవంచనకు పాల్పడతాడు.అంతరాత్మను విడిచిపెట్టి బాహ్యంగా ఉన్న జగత్తును -అర్ధకామాలను,పేరు ప్రఖ్యాతుల్ని ,ఇతరుల సానుభూతిని- ఆశ్రయిస్తాడు. వాటిని అదే పనిగా అన్వేషిస్తూ వాటికోసం హత్యలు చేస్తాడు.లేదా ఆత్మహత్యకు పాల్పడతాడు.
అంతరాత్మను విడిచిపెట్టి బాహ్యజగత్తును ఆశ్రయించిన జీవుడు భంగపడి, జగత్తు కూడా నిమిత్తమాత్రమేనని గుర్తించి, తిరిగి అంతర్ముఖుడై అర్జునుడు కృష్ణుణ్ణి అశ్రయించినట్టు అంతరాత్మనుఆశ్రయిస్తాడు.

ఆత్మవిశ్వాసాన్నిపెంచుకుంటాడు'కర్త నేను కాదు ఈశ్వరుడు' అని గుర్తిస్తే అహం పోతుంది. 'జగత్తు నాది కాదు ఈశ్వరుడిది' అని గుర్తిస్తే దాని మీద మమకారం,అధికారం ఉండవు.సహజంగా జీవించడం అప్పుడే మొదలవుతుంది.అప్పుడిక ఏ పని చేసినా అంతరాత్మ ప్రబోధం(ఆత్మజ్ఞానం) తో,ఆత్మవిశ్వాసంతో చేస్తాం.అహంకార,మమకారాలతో కాదు
'నేను నిమిత్తమాత్రుణ్ణి' అని గుర్తిస్తే బాథ్యతలుంటాయి.బరువులుండవు.'జగత్తు నిమిత్తమాత్రమే' అని గుర్తిస్తే దానితో ఇచ్చిపుచ్చుకోవడం ఉంటుంది.దాని మీద ఆధారపడడం ఉండదు.

గీతాకారుడంటాడు: "శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్"
స్వధర్మం అంటే అంతరాత్మ ప్రభోదించే ధర్మం. పరధర్మం అంటే లౌకిక ధర్మం.రెండిట్లో స్వధర్మమే శ్రేయస్కరం అంటాడు.వెల్లువలో పూచికపుల్ల కూ ,ప్రవాహంలో చేపకు తేడా ఉంది.పూచికపుల్ల చేపగా మారడమే స్వధర్మాన్ని గుర్తెరగడం.'To follow one's impulse is slavery,but to obey self prescribed law is liberty' అంటాడు రూసో.ఆ 'self prescribed law' యే అంతరాత్మ ప్రబోధించే ధర్మం,స్వధర్మం.

జీవుడితో పాటూ జగత్తు కూడా అంతరాత్మదే కాబట్టి, అంతరాత్మ ప్రబోధించే ధర్మంలో వ్యక్తి శ్రేయస్సు తోపాటు,లోక శ్రేయస్సూ ఉంటుంది.జీవుడికీ,జగత్తుకీ రెండింటికీ ఆత్మతో (ఈశ్వరుడితో)ఉన్నసంబంధం కారణంగా,రెండింటి మధ్య ఉన్న సంబంధం అత్మీయమైనది. "కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన"
జీవజగత్తులు నిమిత్తమాత్రములు.కర్మమీద తప్ప ఫలితం మీద వాటికి అధికారం లేదు.
"ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి"
ఈశ్వరుడు సర్వభూతముల హృదయమందుండి వాటిని నడిపించుచున్నాడు.

బ్రహ్మం:క్రింది సమీకరణం అంతటా ఉన్నది ఒకే ఒకటి(1). అది బ్రహ్మం.బ్రహ్మమే,తాడు పాముగా కనిపించినట్టు,జీవుడిగా,జగత్తుగా,ఈశ్వరుడిగా కనపడుతోంది.

అందుకే బ్రహ్మ సత్యం,జగత్తు మిధ్య అన్నారు.ఉపనిషత్తులు కూడా జీవుణ్ణి 'అయమాత్మా బ్రహ్మ'అని జగత్తుని 'సర్వం ఖిల్విదం బ్రహ్మ'అని ఈశ్వరుణ్ణి 'ప్రజ్ఞానం బ్రహ్మ' అని మూడింటినీ బ్రహ్మం గానే పేర్కొన్నాయి.
నేనే జీవుణ్ణి,నా శరీరమే జగత్తు,నా అంతరాత్మే ఈశ్వరుడు. కాబట్టి నేను గుర్తించినా గుర్తించకపోయినా(జంతువులు గుర్తించవు) నేను కూడా బ్రహ్మమే(అహం బ్రహ్మాస్మి).నేను,నా శరీరం,నా అంతరాత్మ -ఇలా మూడింటినీ,మూడుగా వేరు వేరుగా చూస్తే,మూడింటిదీ తలోదారీ అవుతుంది.వాటి మధ్య ఘర్షణ వస్తుంది.మనిషొక చోట ఉంటే మనసొక చోట ఉంటుంది. మాటలకు,చేతలకు పొంతన లేకుండా పోతుంది.మూడింటికీ ఉన్న సంబంధాన్ని,బ్రహ్మాన్ని గుర్తిస్తే,వాటి మధ్య ఐక్యమత్యం వస్తుంది.మనోవాక్కాయకర్మల్లో ఏకత్వం వస్తుంది.ఐకమత్యమే బలం.

బ్రహ్మమే జగమంతకుటుంబంలో రెండుగా
(జీవుడు x జగత్తు),అంటే(భార్య x భర్త),(కవి xకవిత)- ఇలా ఒకరికొకరు వరసైన జంటలుగా మారి తనతో తనే రమిస్తున్నది.ఏకాకిజీవితంలో ఈశ్వరుడై ఏకాంతంగా,జీవజగత్తులకు అంతరాత్మగా,సాక్షిగా ఉంటున్నది.

జీవజగదీశ్వరులుగా జన్మించి,జీవించి,మరణిస్తున్నది బ్రహ్మమే.

నేనెవరు? జీవుణ్ణా,బ్రహ్మాన్నా?రాజ్యం కంటే,యుద్ధం కంటే ఈ ప్రశ్నే ముఖ్యమై అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి అడిగాడు.శ్రీకృష్ణుడు బ్రహ్మమై గీతను బోధించాడు.నేనెవరు? ఈ ప్రశ్నతో నిద్ర పట్టని శ్రీరాముడు అర్ధరాత్రి లేచి వెళ్ళి వశిష్టుడి తలుపు తట్టాడు.లోపల్నుంచి "ఎవరు నువ్వు?" అని వశిష్టుడు ప్రశ్నించగానే,అది తెలియకే వచ్చానన్నాడు రాముడు.
ఇల్లు అలుకుతూ పేరు మర్చిపోయిన ఈగ కథ అందరికీ తెలుసు.పేరు మర్చిపోవడంతో మొదలైన కథ ఒక అన్వేషణా సాగి,తిరిగి పేరు గుర్తు చేసుకోవడంతో ముగుస్తుంది.నేనెవరు?అన్న ప్రశ్నతో మొదలయ్యే జీవుడి అన్వేషణ కూడా 'అహం బ్రహ్మస్మి' అని గుర్తుకు తెచ్చుకోవడంతో ముగుస్తుంది.

'మనిషి' - అంటె... ఎవరు? - ఏఁవిటి?.... ప్రతి మనిషి, 'తాను - తనది', అనడంలో, 'తనది కానిదే తాను' - అని తెలుస్తూనే వుంది. తన దానిని మినహాయిస్తే - తానుగ, మనిషి ఆకార రహితమే! ఊహా మాత్రమే! కనుక, తనదానితో కలిసియున్న 'నేనే'/తనే.... మనిషి!

తాత్విక దృష్టితో - వేదాంత కోణంలో, యోచన చేస్తే...; 'అహం - బ్రహ్మస్మి', బేస్‌గ, 'నేను', అనేది... బ్రహ్మం! ఆత్మ!... అయితే, ఆత్మ భావానికి, 'తనది', అనుకునే, అవకాశం లేదు.

తనది, అనడంలో, భిన్నత వుంది. ఆత్మ - తానుగ, భిన్నతా రాహిత్యం - ఏకత, ఆత్మతత్త్వం; గుణం, భిన్నతను కలిగినది. ఇది, పంచభూత సహిత, పంచేంద్రియ మనసు సహజత! భిన్నతకు శాశ్వత లేదు..., శాశ్వత కానిది - ఏకత
కాలేదు; ఏకత కానిది - ఆత్మ తత్త్వం కాదు.

వేదాంత దృష్టిలో - ఆత్మ - పరమాత్మ - రెండు కలిగియున్నది - ద్వైతం! అలా, ద్వైతం కానిది - అద్వైతం! భిన్నత కానిది... లేనిది - ఏకత (Oneness) కనుక, అద్వైతానికి (Pantheism), ఏకతకు, సూక్ష్మతా భేదం వుంది; అలాగే, ద్వైత - అద్వైత భేదం - అతి సున్నితమైనది; అద్వైత - ఏకత, తారతమ్యత - పరమ సూక్ష్మమైనది; బ్రహ్మం - పరమాత్మ... ఇలాటివే!

అయితే, ద్వైతం, తానుగా చేరిపోతేనే... (పరమాత్మతో) ఏకమైతేనే... అద్వైతం(Oneness). అలాగే, ద్వైతంలోని ఆత్మ, ఆకార భిన్నతా - ఆశ్రయిత! అలా, సృష్టి పదార్ధ, ఆధార, అంతర్గతం; 'జీరో' ప్రామాణికం! ఇదే, పరమ సూక్ష్మతగ, 'అల్టిమేట్ యాబ్సెల్యూట్ జీరో'! అదే, సర్వాధార పరమాత్మ తత్త్వం... బ్రహ్మం మూలం.

సజీవ ఆకార భిన్నతలోనే, 'నేను - నాది', అనే భావం కలుగుతుంది; ఇది, అనివార్యం! నిజానికి, నేను, అనేది, ఆకార ఉనికి రాహిత్యతే! అదే, 'నాది', అనడంలోనే, 'తనది' అనే స్పష్టత వుంది.

అయితే, దానిని, అహంకారంగా భావించడం, గుణకారణమవుతోంది. 'అహం బ్రహ్మస్మి - నేను బ్రహ్మను', అనడంలోనే, గుణ రహిత బ్రహ్మం, స్పష్టమవుతున్నప్పుడు...; దానికి, మనసుకు సహజమైన గుణ వికారాన్ని, ఆరోపించడం...; ఆలోచన చేయవలసిన విషయమే! ఆధార రహిత, పదార్ధ ఆకారానికి, అవకాశంలేనట్లే...(న్యూక్లియస్ సహిత ఆటం) ఆత్మ రహిత బ్రహ్మం - కనుక - 'అహం బ్రహ్మస్మి'లోని, అహంలోని, 'నేను', అహంకార మనసు గుణం కాదు. అందుచేత, ఇంద్రియ ప్రేరిత మనసును కలిగిన, 'నేను - నా', స్వభావం కలిగిన మనిషి - 'అహం బ్రహ్మస్మి' నేను బ్రహ్మను - అనుకునే అవకాశంలేదు; అంటె - సృష్టి ఆధార బ్రహ్మం - 'నేను', అనుకునే, మనిషి... కాదు. 'తనది', అనుకునే, భౌతిక మనసు స్వభావమే అది. (ద పొసెసివ్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ద సెల్ఫ్)

మరి...; 'మనిషి', ఎవరు? నిజానికి, యీ ప్రశ్న, కేవలం, మనిషికే, అన్వయం కాదు. జీవకోటి అంతటికీ, యిది, వర్తిస్తుంది. ఈ విషయంలో, సృష్టి పదార్ధ యేర్పాటు - (ఎంబాడీడ్ ఎనర్జీ). జీవ పదార్ధ ఉనికికి సంబంధించి, అవగాహన అవసరం. విశ్వ శక్తి చేతన పరివర్తనా ఫలిత సృష్టి పదార్ధం..; చలన పరిణామయుత - జీవ పదార్ధం - జీవం - ఆకారజీవి - ఈ క్రమంలోని, జీవులు - జీవ జాతులతో - మానవ జీవి - జాతి... ఒకటి మాత్రమే! అంతర్గత పరిణామ మార్పు (మ్యూటబిలిటీ అండ్ ద Mutatis- mutandis) పదార్ధ ధర్మం. ఇదే, జీవి పదార్ధానికి (బయో ప్లాస్మాటికి మేటర్) - జీవి ఆవిర్భావానికి; జాతి యేర్పాటుకు, అదృశ్య హేతువు. అలాగే జీవుల భిన్నతా ప్రత్యేకతకు గల, హేతువును కూడ, పరిశీలించాలి.

సాధారణంగ, భిన్నమైన కొన్ని ఏకమైనప్పుడు - ఫలితంగ, మరో భిన్నతకే అవకాశం వుంది. పదార్ధ నిర్మాణ, కారణమైన ఎలిమెంట్స్ (మూలకాలు) కలయిక నిష్పత్తి, వాటి గుణ స్వభావాన్ని అనుసరించి ఏర్పడే పదార్ధం - వాటి స్వరూప స్వభావం, దానిని అనుసరించే వుంటుంది.

పంచభూత (వైటల్ ఎలిమెంట్స్) నిర్మిత జీవ పదార్ధం, యిందుకు, అతీతం కాదు; ఫలితంగా కలిగిన, జీవుల భిన్నతా, అంతే మరి! మానవ జీవి, యిందుకు అతీతం కాలేదు. పంచభూతాల కాంబినేషన్‌లోని ప్రత్యేకతే. ఆకార ఆకృతి - స్వరూప స్వభావాలతో సహా - ప్రకృతి జీవులలో మానవజాతికి, భిన్నత కలిగింది. అలాగే ఒకే జాతికి చెందినప్పటికీ, మానవులలో గల వ్యక్తిగత భిన్నతను గమనించినప్పుడు, ఈ వాస్తవం, తెలియగలదు. ప్రకృతిలోని, 'అలవాటు' 'జీవన జీవులకు' - ఆలోచన, గల మానవజాతికి...; అందునా, యోచనా క్వాంటిటీ - క్వాలిటీ భిన్నతతో, మనిషి మనిషికీ మధ్యగల తారతమ్యతను - మనసు స్వభావ భిన్నతను, గమనించ గలిగితే - మనిషి - మనీషి - ఋషి - మహర్షి - రాజర్షి - దేవర్షి మధ్యగల, జ్ఞాన దశల భిన్నత - భేదం, అవగాహన కాగలదు. ఈ క్రమంలో, సాధారణ మనిషి, ప్రాథమికం.

మనిషి - మనసులో - మనిషంటె ఎవరు - అనేదానితో పాటు, మనసంటె, ఏఁవిటి అనే ప్రశ్నకూడ వుంది. వృక్షజాతితో సహా, ప్రకృతి జీవులన్నిటికీ, యిది, వర్తిస్తుంది. అక్షర భాషకు - మౌన భాషకు - సంకేత భాషకు - కూడ, మనసుకు సంబంధించి, ప్రశ్న వుంటుంది. ఒకటిగ కలిసిన, అనేకం/కొన్ని... దేనికదే, విడిగా, 'ఒకటే' సుమా! అయినా, కలిసిన వాటితో యేర్పడిన, 'ఒకటి'కి, వేరుగ, దానికదే, ఉనికి వుండదు. అందుకే 'తనవి' తనతోనే కలిసి, ఒకటిగ వుంటేనే, మనిషి, తానుగ, 'నేను - నాది', అనుకునే అవకాశం వుంటుంది. 'ఒకటిలో అనేకం, అనేకం ఒకటిగ - ఏకతా - భిన్నత - భిన్నతా ఏకత' అనడంలోని, సృష్టి ఉనికి ఫార్మేషన్ బాహ్య దృశ్యత, అంతర అదృశ్యత - వాటి సన్నిహిత బంధం కూడ - ఇలాటిదే! అశాశ్వత, శాశ్వత, దీనిలోనిదే! కనుక, 'ఒకటి బ్రహ్మం...; సృష్టి అనేకం'....; అలాగే, 'శరీరం అనేకం - ఆత్మ ఒకటే'!

'అహం బ్రహ్మాస్మి'ని, సృష్టి, విశ్వరూపాన్ని - ఈ విశ్లేషణగ, అవగాహనకు ప్రయత్నించాలి. అలాగే, మనిషి - మనసు; మనసు - ఆత్మ; ఆత్మ - పరమాత్మ...; పరమాత్మ - బ్రహ్మం.... ఈ క్రమంలో, ధ్యాన జ్ఞాన యోగ మార్గంలో, ఆత్మానుభూతికి ప్రయత్నించాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+