‘పెద్ది’ వివాదంపై రంగంలోకి దిగిన పవన్ కల్యాణ్
టాలీవుడ్లో గత కొన్ని వారాలుగా ఇండస్ట్రీని కుదిపేస్తున్న "రెంటల్ వర్సెస్ పర్సంటేజ్" వివాదం తీవ్ర రూపు దాల్చింది. మల్టీప్లెక్స్ల తరహాలోనే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కూడా టికెట్ కలెక్షన్ల ఆధారంగా తమకు 60 శాతం వరకు లాభాల వాటా ఇవ్వాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేయడం, దానికి నిర్మాతలు ఒప్పుకోకపోవడంతో పెద్ద వివాదమే నడిచింది. ముఖ్యంగా జూన్ 4న విడుదల కాబోతున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా చిత్రం 'పెద్ది' విడుదలకు ఈ గొడవ పెద్ద అడ్డంకిగా మారింది.
ఈ నేపథ్యంలో టాలీవుడ్ అగ్ర నిర్మాతలు సరికొత్త వ్యూహంతో రంగంలోకి దిగారు. రాజమండ్రి పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను అగ్ర నిర్మాతలు మైత్రి రవిశంకర్, సితార నాగవంశీ, సాహు గారపాటి, సుధాకర్ చెరుకూరి తదితరుల బృందం అత్యవసరంగా కలిసింది. ఈ భేటీలో నిర్మాతలు 'పెద్ది' సినిమా విడుదల చుట్టూ జరుగుతున్న రాజకీయాన్ని పవన్ కళ్యాణ్కు కూలంకషంగా వివరించారు.

'పెద్ది' సినిమాపై జరుగుతున్న రాజకీయం..
భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'పెద్ది' సినిమా విడుదలను కొందరు కావాలనే టార్గెట్ చేస్తున్నారని, ఈ వివాదాన్ని అడ్డుపెట్టుకుని సినిమా కలెక్షన్లను దెబ్బతీసేలా తెరవెనుక రాజకీయం నడుస్తోందని నిర్మాతలు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. మార్కెట్ ఇప్పటికే ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు, ఇలాంటి పెద్ద సినిమా రిలీజ్ టైమ్లో ఉన్నపళంగా రూల్స్ మార్చాలని ఒత్తిడి తేవడం వెనుక ఉన్న వ్యూహాలను వారు వివరించారు. థియేటర్ల నిర్వాహకులు 'పెద్ది' సినిమాను ప్రదర్శించబోమని కండిషన్లు పెట్టడం వల్ల ఇండస్ట్రీ ఎంతలా నష్టపోతుందో, నిర్మాతలపై ఎలాంటి ఒత్తిడి పెరుగుతుందో వివరించారు.
సినిమాను ఇరుకున పెట్టేలా ప్రయత్నిస్తున్నారు..
విద్యుత్ ఛార్జీల భారం, థియేటర్ల మెయింట్ నెన్స్ వంటి జెన్యూన్ సమస్యలను తాము కాదనడంలేదని, కానీ ఒక పెద్ద సినిమాను ఇరుకున పెట్టి ఇలాంటి నిర్ణయాలు రుద్దడం కరెక్ట్ కాదని నిర్మాతలు వాదించారు. ఈ సమస్యకు ప్రభుత్వం వైపు నుంచి పొలిటికల్, అడ్మినిస్ట్రేటివ్ మద్దతు ఉంటేనే శాశ్వత పరిష్కారం దొరుకుతుందని, అందుకే తాము డిప్యూటీ సీఎంను ఆశ్రయించామని వారు తెలిపారు. నిర్మాతలు చెప్పిన వివరాలన్నింటినీ సుదీర్ఘంగా, ఓపికగా విన్న పవన్ కళ్యాణ్ దీనిపై సానుకూలంగా స్పందించారు.
సినిమా పరిశ్రమలో ఏ ఒక్క వర్గానికీ నష్టం జరగకుండా సమన్యాయం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా కావాలని సినిమాలను టార్గెట్ చేస్తూ రాజకీయం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ సమస్యను లోతుగా పరిశీలించి, ఇండస్ట్రీ పెద్దలతో చర్చలు జరిపి తగిన నివేదికను సిద్ధం చేయాల్సిందిగా ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ను పవన్ కళ్యాణ్ తక్షణమే ఆదేశించారు. త్వరలోనే టాలీవుడ్లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించి, పరిశ్రమ సజావుగా సాగేలా చూస్తామని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications