మృగశిర కార్తె:సకల జనులకు ఎందుకు ఊరటనిస్తుంది..?
డా. యం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
మృగశిర కార్తె వచ్చిందంటే సకలజనులకు వూరట కలుగుతుంది. అప్పటివరకు గ్రీష్మతాపంతో అల్లాడుతున్న సర్వకోటి జీవాలు తొలకరిజల్లులతో స్వాంతన చెందుతారు. రోహిణికార్తెలో రోళ్లు పగిలే ఎండలు కాస్తాయి. అనంతరం మృగశిర కార్తె వస్తుంది. రుతుపవనాల రాకను మృగశిరకార్తె ఆహ్వానిస్తుంది. చంద్రుడు ఏ నక్షత్రంలో ప్రవేశిస్తే ఆ రాశి ప్రారంభమవుతుంది. జింక తల కలిగివుండటంతో ఈ కార్తెను మృగశిరకార్తెగా వ్యవహరిస్తారు.
ఈ కార్తె మనదేశంపై విశేషప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఈ రాశిలోనే నైరుతి రుతువపనాలు భారత్లోకి ప్రవేశిస్తాయి. అప్పటివరకు నిప్పులు చెలరేగిన భానుడి కిరణాలు నల్లటి మేఘాల ప్రభావంతో చల్లబడుతాయి. దేశానికి జీవధార అయిన వర్షాలతో నేలతల్లి పులకరిస్తుంది. రైతులు తొలకరి జల్లులు పడగానే దుక్కి దున్ని పంటలు వేసేందుకు సిద్ధమవుతారు. ఏరువాకసాగే కాలం అని కూడా అంటారు.
మృగశిర నక్షత్రం దేవగణానికి చెందినది. అధిపతి కుజుడు. రాశి అధిపతులు శుక్రుడు, బుధుడు. ఈ నక్షత్రంలో జన్మించినవారు మంచి అదృష్టం కలిగివుంటారు. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు రావడం వలన శరీరంలో కూడా సమతుల్యం దెబ్బతినకుండా ఉండడానికి నేడు ఇంగువ బెల్లం కలిపి తీస్కోవడం అనేది మన ఆనవాయితీ. మన రైతులు ప్రకృతిలో సమతూకం దెబ్బతినకుండా పంటలు సాగు చేశారు.
తమ అనుభవాల విజ్ఞాన సారాన్ని సామెతలలో పదిలపరచుకున్నారు. తెలుగురైతులు సామెతల రూపంలో వ్యవసాయ విజ్ఞానాన్ని దాచారు. తరువాతి తరాలకూ ఆ జ్ఞానం అందేలా చేశారు. పురుగుమందులు, జన్యుమార్పిడి విత్తనాలు, ప్రకృతి వైపరీత్యాలతో భయంగొలుపుతున్న కొత్త సమాజంలో రాబోయే రోజుల్లో ఇంకా కొత్త సామెతలు పుట్టవచ్చు. జోతిష్కులు 27 నక్షత్రాల ఆధారంగా జాతకాలు, పంచాంగాలు తయారు చేశారు.
సూర్యోదయమప్పుడు ఏ చుక్క (నక్షత్రం) చంద్రుడికి దగ్గరగా ఉంటే ఆ రోజుకు ఆ నక్షత్రం పేరు పెట్టారు. పున్నమి రోజు చంద్రుడు ఏ చుక్కతో ఉంటే ఆ నెలకు ఆ పేరు పెట్టారు. కానీ తెలుగు రైతులు మాత్రం ఇవే నక్షత్రాలతో తమ అనుభవాల ఆధారంగా వ్యవసాయ పంచాంగాలు తయారుచేసుకున్నారు. ఈ నక్షత్రాలను కార్తెలు అని పిలిచారు. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి ఆ కార్తె పేరు పెట్టారు. సంవత్సరానికి 27 కార్తెలు. తెలుగు ప్రజానీకం చంద్రమానాన్ని పాటిస్తుంటే తమిళులు సౌరమానాన్ని పాటిస్తున్నారు. తెలుగు రైతులు తరతరాలుగా తమ అనుభవాలలోనుంచి సంపాదించుకున్న వ్యవసాయ వాతావరణ విజ్ఞానాన్ని కార్తెలు వాటిపై సామెతల రూపంలో ప్రచారం చేశారు.