వెనకబడినప్రాంతాలకు సిఎం హామీ
వరంగల్:వెనకబడిన ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని దేవాదులలో గోదావరిపై ఎత్తిపోతల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సందర్భంగా శనివారం వరంగల్లో ఏర్పాటు చేసిన బ్రహ్మాండమైన బహిరంగ సభలో ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
వరంగల్ జిల్లా అభివృద్ధికి అనేక హామీలు ఇచ్చారు. గోదావరి జలాల సద్వినియోగానికి తమ ప్రభుత్వం కట్టుబడి వున్నదని ఆయన చెప్పారు. గోదావరి ఎగువ ప్రాంతాల్లో ఎత్తిపోతల పథకాల వల్లనే సాగునీరు అందించవచ్చని ఆయన అన్నారు. అనూహ్యంగా ఈ సభనే ముఖ్యమంత్రి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార సభగా కూడా మలిచారు. నేరుగా ఎన్నికలప్రస్తావన తేవడం ద్వారా ఎన్నికల ప్రచారానికి ఆయన శ్రీకారం చుట్టారు.
పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి ఊతం ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. అభివృద్ధిని కోరుకునే ప్రజలు తెలుగుదేశం అభ్యర్ధులనే గెలిపిస్తారన్న విశ్వాసం తనకు వున్నదని ముఖ్యమంత్రి చెప్పారు. వరంగల్లో పోలీసు కమిషనరేట్ ఏర్పాటు చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. ఎంజిఎం ఆస్పత్రిని వెయ్యి పడకల ఆస్పత్రిగా ఆధునీకరించనున్నట్టు వెల్లడించారు. ఆజంజాహి మిల్లు పునరుద్దరకు తమ ప్రభుత్వం శాయశక్తుల ప్రయత్నిస్తుందని హామీ ఇచ్చారు. సింగరేణి కార్మికులు సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశారు. భూపల్పల్లిలో థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేసే ప్రతిపాదన వున్నదని ఆయన చెప్పారు. ప్రైవేట్రంగంలో త్వరలో ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజీ వల్ల త్వరలోనే మరో 600 పడకల ఆస్పత్రి కూడా జిల్లాలో ఏర్పాటయ్యే అవకాశం వున్నదని ఆయన చెప్పారు.
దేవాదుల ఎత్తిపోతల వల్ల ఇచ్చంపల్లి, వరదకాలువ ప్రతిపాదనలు పెండింగ్లో పడిపోవని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులను పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం అంతర్జాతీయంగా ఆర్ధిక సాయాన్ని సాధిస్తుందని ఆయన చెప్పారు. వెనకబడిన ప్రాంతల్లో అభివృద్ధి లేమికి కాంగ్రెస్ కారణమని ఆయన దుయ్యబట్టారు. ఎన్నికల కోసం ఎత్తిపోతల ప్రాజెక్టును హడావుడిగా తాము చేపట్టలేదని ఆయన చెప్పారు. గోదావరి జలాల వినియోగానికి ఎత్తిపోతల పథకాలే అవసరమన్న విషయం తమకు బాగా తెలుసునని ఆయన స్పష్టం చేశారు.