అధికార వ్యామోహంతో అసత్య ప్రచారం
హైదరాబాద్: అధికార వ్యామోహంతో కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసత్య ప్రచారం చేస్తున్నాయని తెలుగుదేశం నేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల తర్వాత ప్రభుత్వం విద్యుత్ చార్జీలను హెచ్చిస్తుందనే ప్రచారం పూర్తిగా అబద్ధమని ఆయన చెప్పారు.
అవసరమైతే సబ్సిడీలను పెంచడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా వున్నదని ఆయన స్పష్టం చేశారు. బుధవారం నాడు జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న మరో 125 మంది తెలుగుదేశం అభ్యర్ధుల జాబితాను చంద్రబాబు విడుదల చేశారు. రాష్ట్రంలో కొత్త విద్యుత్ ప్రాజెక్టులు నిర్మాణంలో వున్నాయని ఈ ప్రాజెక్టులు ఉత్పత్తి ప్రారంభిస్తే విద్యుత్ కొరతే వుండదని ఆయన చెప్పారు.
విద్యుత్, నీటిపారుదల రంగాల్లో తమ ప్రభుత్వం సాధించిన ప్రగతిని రాష్ట్రంలో మున్నెన్నడు సాధించలేదని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే దానిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని ఆయన దుయ్యబట్టారు. ఉచిత విద్యుత్ గురించి కబుర్లు చెబుతున్న కాంగ్రెస్ పార్టీవారు దమ్ముంటే తాము అధికారంలో వున్న రాష్ట్రంలో ఉచిత విద్యుత్ ఇవ్వాలని చంద్రబాబు సవాలు విసిరారు.
అప్పుడే ఉచిత విద్యుత్ గురించి కాంగ్రెస్ చెబుతున్న కబుర్లు ప్రజలు విశ్వసిస్తారని ఆయన అన్నారు. ఉచిత విద్యుత్ ఎలా సాధ్యమని అడుగుతే అధికారం అప్పగిస్తే చూపిస్తామని కాంగ్రెస్ నేతలు అనడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. గోదావరి ఎత్తిపోతలకు బడ్జెట్లో పైసా కూడా కేటాయించలేదనడం అబద్దమని 50 కోట్ల రూపాయలను తాము కేటాయించామని ముఖ్యమంత్రి వివరించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అసత్య ప్రచారానికి ప్రజలే తగిన విధంగా జవాబు చెబుతారని ఆయన అన్నారు.