RBI: మే 26న కీలక పరిణామం.. అసలేంటి ఈ 'డాలర్-రూపాయి స్వాప్'?
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల మంట, ఇరాన్ యుద్ధ మేఘాల వంటి అనిశ్చిత పరిస్థితుల వల్ల దేశీయ కరెన్సీ రూపాయి విలువ రోజురోజుకూ రికార్డు స్థాయికి పడిపోతోంది. ఈ పతనానికి అడ్డుకట్ట వేసి, భారత బ్యాంకింగ్ వ్యవస్థలోకి సరికొత్త ఊపిరి లూదేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రంగంలోకి దిగింది. మార్కెట్లో లిక్విడిటీని (నగదు లభ్యత) పెంచడంతో పాటు రూపాయిని నిలబెట్టేందుకు ఏకంగా 5 బిలియన్ డాలర్ల విలువైన 'డాలరు-రూపాయి బై/సెల్ స్వాప్' వేలాన్ని నిర్వహించబోతున్నట్లు ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. మే 26న ఈ ప్రతిష్టాత్మక వేలం ప్రక్రియ జరగనుంది.
ప్రస్తుత ప్రపంచ ఆర్థిక పరిస్థితులను నిశితంగా సమీక్షించిన తర్వాతే, మూడేళ్ల కాలపరిమితితో కూడిన ఈ యూఎస్డీ/ఐఎన్ఆర్ (USD/INR) స్వాప్ వేలాన్ని చేపట్టాలని నిర్ణయించినట్లు ఆర్బీఐ తన తాజా సర్క్యులర్లో స్పష్టం చేసింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో రూపాయి మరింత బలహీనపడకుండా చూసేందుకు ఈ చర్యలు అత్యంత కీలకంగా మారనున్నాయి.

అసలు ఏమిటీ 'స్వాప్' వేలం?
ఆర్థిక మార్కెట్లలో నగదు కొరతను తీర్చడానికి, కరెన్సీ విలువను స్థిరీకరించడానికి ఆర్బీఐ ఉపయోగించే ఒక వ్యూహాత్మక ఆయుధమే ఈ 'బై/సెల్ స్వాప్'. ఈ ప్రక్రియ సాధారణంగా ఇలా సాగుతుంది:
- డాలర్ల విక్రయం: వాణిజ్య బ్యాంకులు తమ వద్ద ఉన్న అమెరికన్ డాలర్లను రిజర్వ్ బ్యాంక్కు విక్రయించి, దానికి సమానమైన భారతీయ రూపాయలను పొందుతాయి. దీనివల్ల బ్యాంకుల వద్ద తక్షణమే రూపాయిల లభ్యత పెరుగుతుంది.
- తిరిగి కొనుగోలు ఒప్పందం: సరిగ్గా మూడేళ్ల గడువు ముగిసిన తర్వాత, అదే మొత్తంలో డాలర్లను ముందే నిర్ణయించుకున్న ప్రీమియం ధరతో ఆర్బీఐ నుంచి బ్యాంకులు తిరిగి కొనుగోలు చేస్తాయి.
లాభం ఏంటి?
ఈ వేలం ద్వారా మార్కెట్లోకి భారీగా రూపాయలు అందుబాటులోకి రావడమే కాకుండా, దేశ విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్ రిజర్వ్స్) బలోపేతం అవుతాయి. ఫలితంగా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ మరింత క్షీణించకుండా రక్షణ కవచంలా పనిచేస్తుంది.
ఈ మెగా వేలంలో పాల్గొనాలనుకునే బ్యాంకులు కనీసం 10 మిలియన్ డాలర్ల సైజ్తో బిడ్ దాఖలు చేయాల్సి ఉంటుందని ఆర్బీఐ నిబంధన విధించింది. అంతర్జాతీయంగా చమురు సంక్షోభం వెంటాడుతున్న తరుణంలో ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం మార్కెట్లలో సానుకూలతను నింపుతుందని నిపుణులు భావిస్తున్నారు.














Click it and Unblock the Notifications