సత్యం మిషన్ యూరప్
హైదరాబాద్ః సత్యం కంప్యూటర్స్ యూరప్ మార్కెట్ విస్తరణకు పెద్దఎత్తున ప్రయత్నాలు చేస్తున్నది. ఈ ఏడాది టర్నోవర్లో యూరప్ వ్యాపారం వాటా కనీసం 15 శాతం వుండాలన్నది తమ ధ్యేయమని సత్యం కంప్యూటర్స్ వర్గాలు చెప్పాయి. ప్రస్తుతం సత్యం టర్నోవర్లో యూరప్ టర్నోవర్ మొత్తం 7.5 శాతం లోపువుంది. గత ఏడాది సత్యం స్ఠూల టర్నోవర్లో అమెరికా వాటా 76.5 శాతం వుండగా, జపాన్ వాటా 3.6 శాతం వుంది.
యూరప్ వాటా 7.3 శాతం వుండగా మిగిలిన ప్రపంచదేశాల వ్యాపారం వాటా 12.6 శాతం వుంది. ఈ మధ్యనే సత్యం జపాన్, ఆసియాపసిఫిక్, యూరప్ మార్కెటింగ్ అనుబంధ సంస్థలను మూసివేసింది. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ తర్వాత గ్లోబల్గా సత్యం బ్రాండ్నేమ్కు మంచి గుర్తింపు లభించిందని అందువల్ల తాము ప్రత్యేక మార్కెటింగ్ అనుబంధ సంస్థల అవసరం లేదని భావిస్తున్నామని సత్యం వర్గాలు చెప్పాయి.
యూరప్లో ఇప్పటికే విశేషమైన అనుభవం సాధించిన కారణంగా తాము అక్కడి మార్కెట్లో బ్రహ్మాండంగా రాణించగలమన్న ధీమా వారు వ్యక్తం చేశారు. జర్మనీ, బెల్జియం, ఫ్రాన్స్, నెదర్లాండ్స్లో నేరుగా శాఖలనే ప్రారంభించే ఆలోచనలో సత్యం వున్నదని వారు చెప్పారు. తమ వ్యాపార వ్యూహంలో భాగంగానే తాము యూరప్పై దృష్టి సారిస్తున్నాము తప్ప అమెరికా మాంద్యం వల్ల కాదని కూడా వారు వివరణ ఇచ్చారు.