శాఖల మార్పుపై మిత్రుల కినుక
న్యూఢిల్లీః కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఎన్డిఎ భాగస్వామ్య పక్షాల్లో నిరసన వ్యక్తం అవుతున్నది. కీలకమైన కమ్యూనికేషన్ల శాఖ నుంచి రామ్ విలాస్ పాశ్వాన్ తప్పించడం, శరద్ యాదవ్ చేతినుంచి పౌరవిమానయానాన్ని లాక్కోవడం మిత్రులకు మింగుడు పడటం లేదు.
విమానయాన శాఖ మంత్రిగా వుంటూ ఆ శాఖలో డిజ్ఇన్వెస్ట్మెంట్ను వ్యతిరేకిస్తున్న కారణంగా శరద్యాదవ్ను తప్పించినట్టుగా చెబుతున్నారు. అదే విధంగా రామ్విలాస్పాశ్వాన్ టెలీకామ్ శాఖలో చిత్తంవచ్చినట్టుగా పాపులర్ పథకలు ప్రకటిస్తున్నట్టుగా ఆరోపణలు వున్నాయి. ప్రభుత్వం అనుసరిస్తున్న సంస్కరణ విధానాలకు భిన్నంగా వ్యవహరిస్తున్న కారణంగానే ఆయన్ను తప్పించారని చెబుతున్నారు. అదీ కాకుండా కన్వర్జెన్స్ బిల్లు నేపథ్యంలో ఐటి శాఖను చూస్తున్న తన విధేయుడు ప్రమోద్మహాజన్కే టెలీకామ్ శాఖ కూడాఅప్పగించాలని ఆయన భావించివుంటారని అంటున్నారు.
ఈ అసమ్మతి ఏదో క్షణంలో బయటపడే అవకాశం వున్నదనిఅంటున్నారు. ప్రస్తుతానికి తేలుకుట్టిన దొంగల్లా శాఖల పంపిణీ ప్రధాని యిష్టమని, ఏశాఖైనా ఒక్కటేనని నీతులు వల్లిస్తున్న ఈ ఇద్దరు సమయం వచ్చినప్పుడు బయటపడటం ఖాయమనిఅంటున్నారు. ప్రధాని వాజ్పేయి సంకీర్ణ ప్రభుత్వం నేతగా కాకుండా బిజెపి ప్రధానిగా వ్యవహరిస్తున్నారన్నవిమర్శలు వస్తున్నాయి.