ఆర్డీఎస్: కేంద్రానికి రాష్ట్రం నివేదన
న్యూఢిల్లీ: రాజోలిబండ మల్లింపు పథకంపై రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటకకు వ్యతిరేకంగా కేంద్రానికి ఫిర్యాదు చేసింది. కర్ణాటక తన వాటాకన్నా అధికంగా నీరును వాడుకొని రాజోలిబండ ప్రాజెక్ట్ కు నీరుఅందించడంలేదని రాష్ట్ర బృందం కేంద్ర జలవనరుల శాఖమంత్రి సేథీని మంగళవారం న్యూఢిల్లీలో కలిసివిన్నవించారు.
తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఎర్రన్నాయుడు, రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి కడియం శ్రీహరి తదితరులతో కూడిన బృందం మంగళవారం కలిసింది. కర్ణాటక అక్రమంగా వాడుకుంటోన్న జలవనరుల మూలంగానే మహబూబ్ నగర్ రైతులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని కడియం శ్రీహరివిలేకరులకు వివరించారు.
మరోవైపు, మంగళవారం లోక్ సభలో కర్ణాటక అక్రమంగా నిర్మిస్తోన్న ప్రాజెక్ట్ లపై చర్చను కోరుతూ టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. లోక్ సభస్పీకర్ మనోహర్ జోషి అందుకు నిరాకరించారు. దీంతో టీడీపీ సభ్యులు తీర్మానం కోసం పట్టుబడుతూ..పోడియం వద్దకు దూసుకుపోవడంతో సభ కాసేపు స్థంభించింది. వేరే నోటిసు ప్రత్యేకంగా ఇస్తే..జల వనరుల శాఖ మంత్రితో సమాధానం ఇప్పిస్తాననిస్పీకర్ హామీ ఇవ్వడంతో టీడీపీ సభ్యులు శాంతించారు.