వ్యవసాయం నేర్చుకొండి, బాబు సలహా
హైదరాబాద్: తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అంతా వ్యవసాయం నేర్చుకోవాలని ఆ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. వ్యవసాయం చేయకపోయినా, వ్యవసాయం గురించి తెలుసుకుంటే ఉపయోగకరంగా ఉంటుందని పార్టీ నేతలకు ఆయన చెప్పారు.
నేను ఇటీవల పర్యటన సందర్భంగా దుక్కి దున్నుతోన్న కొంతమంది రైతులకు సరియైన విధానం గురించి వివరించాను. మీరు కూడా వ్యవసాయం గురించి తెలుసుకుంటే రాష్ట్రంలో 70 శాతం మంది వ్యవసాయం మీదే ఆధారపడుతోన్న వారికి ఉపయోగకరంగా ఉంటుందని చంద్రబాబు నాయుడు పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో (రెండో రోజు) పార్టీ నేతలకు వివరించారు.
ఆదివారం ఆయన అధికంగా వ్యవసాయం, నీటిపారుదల రంగాలపైనే మాట్లాడారు. గ్రామం యూనిట్ గా బీమా పాలసీ అమలు గురించి ఆలోచిస్తున్నామన్నారు. ఇప్పుడిప్పుడే వాతావరణ పరిస్థితులు మెరుగుపడుతున్నందున రైతులకు అందుబాటులో సమాచారం ఉండేలా పార్టీ కార్యకర్తలు చూడాలన్నారు. బిందు, తుంపర సేద్యాలపై దృష్టి సారించాలని రైతులకు తాము సూచించినట్లు ఆయన అన్నారు.
ఈ సారి కృష్ణా ప్రాజెక్ట్ కింద ఖరీఫ్ సీజన్ లో నీరు అందించడం సాధ్యం కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. వీలైతే రబీ సీజన్ లో కాస్తా ముందుగానే నీరు అందించేందుకు ప్రయత్నిస్తామని ఆయన అన్నారు.