అయోధ్య: విపక్షాలపై వెంకయ్య విసుర్లు
చెన్నై: అయోధ్య అంశాన్ని విపక్షాలు పార్లమెంట్ లో పదేపదే లేవనెత్తి రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ అధ్యక్షుడు ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఉప ప్రధాని అద్వానీపై ఛార్జీషీట్ ఉపసంహరణ కుట్ర ఉందని ఆరోపిస్తోన్న కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. అద్వానీ రాజీనామా చేసే ప్రసక్తి లేదని వెంకయ్యనాయుడు ఆదివారం చెన్నైలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు.
సీబీఐ హోంశాఖ కింద పనిచేయదన్న వాస్తవాన్ని విపక్షాలు గ్రహించాలన్నారు. అద్వానీ రాజీనామా చేయాలా వద్ద అనేది కోర్టు నిర్ణయిస్తుందని, కానీ కాంగ్రెస్ మాత్రం పార్లమెంట్ నిర్ణయిస్తుందన్నట్లుగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పీవీ హయంలో ఉత్తరప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన కొనసాగుతోన్న సమయంలో అద్వానీపై ఛార్జ్ షీట్ దాఖలు చేశారని ఆయన తెలియచేశారు. అంతేకానీ, కుట్రపన్నారని ఛార్జ్ షీట్ దాఖలు చేయలేదని ఆయన గుర్తుచేశారు. పార్లమెంట్ సమావేశాల సమయాన్ని వృధా చేయడం మినహా విపక్షాలు అయోధ్యపై చర్చ ద్వారా సాధించేదేమీ లేదన్నారు.