పరిటాల హత్యలో వైయస్ ప్రమేయానికి నిదర్శనం
హైదరాబాద్: శాసనసభ్యుడు పరిటాల రవి హత్య కేసులో నిందితురాలైన గంగుల భానుమతి ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డితో పాటు పర్యటన చేయడంపై తెలుగుదేశం తీవ్రంగా ధ్వజమెత్తింది. తన నగరబాటలో తన వాహనంపైకి భానుమతిని ఆహ్వానించడం పరిటాల హత్యలో ముఖ్యమంత్రి ప్రమేయానికి నిదర్శనమని తెలుగుదేశం నాయకుడు డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తన పర్యటనలో భానుమతికి ఇచ్చిన ప్రాధాన్యాన్ని బట్టే పరిటాల హత్యలో ముఖ్యమంత్రి ప్రమేయం ఉన్నదని చెప్పవచ్చునని ఆయన అన్నారు. ఈ విషయాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రికి చట్టాలు తెలియవా అని అడిగారు. నిందితులను వెనకేసుకొని రావడం, నిందితులను దాచి పెట్టడం నేరం కాదా అని ఆయన ముఖ్యమంత్రి చర్యను ప్రశ్నించారు. బాహాటంగా భానుమతిని తన వాహనం మీదికి ఆహ్వానించిన విషయంపై వివరణ ఇవ్వాలని ఆయన ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు.